మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 31: ఇటీవలే వివాహమైన కూతురు కాపురానికి పోవట్లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. దూలం కర్రతో కొట్టి ఆమెను దారుణంగా హతమార్చాడు. బిడ్డకు మద్దతు పలికిన భార్యను సైతం అంతమొందించాడు. ఆపై పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యాయత్నం చేశా డు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ మండలంలోని జైనల్లీపూర్కు చెందిన దెయ్యాల కృష్ణయ్య (50), కళావతమ్మ (45) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రెండో కూతురు సరస్వతి (22)కి మే 8న మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ పెండ్లి తనకు ఇష్టంలేదని సరస్వతి తండ్రికి ముందే చెప్పినా బెదిరించి వివాహం చేశారు. అత్తగారింటికి వెళ్లిన సరస్వతి మే 25న తల్లిగారింటికి వచ్చింది. అత్తగారింటికి ఇక వెళ్లనని తెగేసి చెప్పింది. కాపురానికి వెళ్లాల్సిందేనం టూ కూతురిని తండ్రి మందలించాడు. ఈ విషయంలో తల్లి కళావతమ్మ కూతురుకి మద్దతుగా మాట్లాడింది. సోమవారం రాత్రి మరోసారి ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన కృష్ణయ్య అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న సరస్వతి, కళావతమ్మను దూలం కర్రతో బలంగా కొట్టాడు. రక్తపు మడుగులో ఉన్న భార్య, కూతురిని చూసి భయంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయా న్ని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడికి చేరుకొన్న బంధువులు ముగ్గురిని మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కళావతమ్మ, సరస్వతిని హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. కృష్ణయ్య మహబూబ్నగర్లోని జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.