Chicken | ఖమ్మం : పిల్లలు తమకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు మాత్రమే ఇష్టపడుతుంటారు. నచ్చని కూర వండితే ఆ రోజు అన్నమే తినరు. ఉపవాసమైనా ఉంటారు.. కానీ ఆ వంట వాసన కూడా చూడరు. అయితే ఓ పిల్లాడు కూడా కోడి మాంసానికి దూరంగా ఉన్నాడు. కోడి కూర ఎందుకు తినడం లేదని ఆ పిల్లాడిని తండ్రి చితకబాదాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్న చికెన్ తీసుకొచ్చాడు. ఇక వంట చేసిన తర్వాత శ్రీనివాస్ కుమారుడు మురళి(9) మాత్రం ఆ చికెన్ తినలేదు. దీంతో తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురై కుమారుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. శరీరమంతా వాపు వచ్చింది. నిన్న సాయంత్రం విషయం తెలుసుకున్న తల్లి మహేశ్వరి కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఆ తర్వాత భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.