Gadwal | గద్వాల, జూన్ 11: జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ఈ ప్రాంతం తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పెట్టింది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దుగా ఉన్న అలంపూర్, గద్వాల నియోజకవర్గాల రూపురేఖలే మారిపోయాయి. నడిగడ్డపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉండటంతో అభివృద్ధికి కేరాఫ్గా మారింది. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం ప్రత్యేక చొరవతో అనతి కాలంలోనే దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను విడతలవారీగా కల్పిస్తున్నారు.
కొత్త జిల్లాతో చేరువైన పాలన
జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. పనుల్లో పారదర్శకత నెలకొన్నది. వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నారు. జిల్లాగా ఏర్పడిన తర్వాత సుమారు 36 శాఖల అధికారులు ప్రజలకు 50 కిలోమీటర్ల లోపే అందుబాటులో ఉంటున్నారు. విద్య, వైద్య పరంగానూ జిల్లా ఎంతో మెరుగుపడింది.
సకల సదుపాయాలతో కలెక్టరేట్, ఎస్పీ భవనాలు
గద్వాల జిల్లా ఏర్పాటు తర్వాత ప్రజలకు పా దర్శక పాలన అందుతున్నది. అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అన్ని శాఖలు ఒకేచోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మించారు. రూ.52 కోట్లతో కలెక్టరేట్, రూ.38 కోట్లతో ఎస్పీ కార్యాలయం నిర్మించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు సొబగులు
జిల్లాలో సాగునీరు పుష్కలమైంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని రైతులు ఎక్కువగా కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో కూరగాయలు విక్రయించడానికి సరైన మార్కెట్ లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించేవారు. ఇది గ్రహించిన ప్రభుత్వం మార్కెట్ ఆవరణలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. నాలుగు బ్లాక్ల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వెజిటబుల్, సూపర్ మార్కెట్, చేపల మార్కెట్, ఫుడ్కోర్టు, పూలు, పండ్లు అమ్ముకునే వారికి ప్రత్యేకంగా దుకాణాలు నిర్మిస్తున్నారు. దీంతో ప్రజలకు దూరాభారం తగ్గనున్నది.
ఇండోర్ ఆడిటోరియం
ఒకప్పుడు గద్వాలలో ఏవైనా సమావేశాలు, విద్యార్థులకు అవసరమైన ప్రోగ్రాంలు నిర్వహించాలంటే సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ఈ నేపథ్యంలో నల్లకుంటలో మల్టీపర్పస్ ఇండోర్ ఆడిటోరియాన్ని రూ.6.25 కోట్లతో నిర్మిస్తున్నారు. పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇండోర్ గేమ్స్తోపాటు పట్టణానికి సంబంధించిన వివిధ రకాల ప్రభుత్వ, ప్రజాసంబంధ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు.
సెంట్రల్ లైటింగ్
గద్వాలలో రూ.11.90 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, వ్యర్థాల శుద్ధి కేంద్రం, రెండు వైకుంఠధామాలు, ఎల్పీజీ డబుల్ సిలిండర్ బర్నింగ్ క్రీమిటోరియం, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, 39 స్ట్రీట్ వెండింగ్ దుకాణాలు, 15 పబ్లిక్ టాయిలెట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డంప్యార్డు, ప్రతి వార్డులో పట్టణ ప్రకృతివనాలు, వాటిల్లో ఓపెన్జిమ్లు, స్మృతివనం, సంఘాల చెన్నకేశవ పార్కు నిర్మించారు. వీటితోపాటు రూ.56 కోట్ల సీఎం అభివృద్ధి నిధులతో పనులు చేపట్టారు. జూరాల వద్ద రూ.15 కోట్లతో బృందావనం గార్డెన్ నిర్మిస్తున్నారు.
పీజీ కళాశాల విద్యార్థులకు హాస్టల్
పీజీ కళాశాల జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ అక్కడ వసతి గృహం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించడంతో వసతి గృహం కోసం రూ.10 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం రెండు వసతి గృహాలను నిర్మిస్తున్నారు. నూతన కళాశాల బిల్డింగ్, అదనపు వసతి గృహాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ పనులు పూర్తయితే విద్యార్థులకు మేలు చేకూరుతుంది. జూనియర్ కళాశాల నూతన భవనం రూ.1.50 కోట్లతో, డిగ్రీ కళాశాలలో అదనపు గదులు రూ.80 లక్షలతో నిర్మిస్తున్నారు.
నూతన బస్స్టేషన్
గద్వాల పాత బస్స్టేషన్ చిన్నగా ఉండి పెచ్చులూడి పడుతుండటంతో ప్రస్తుతం కొత్తగా నిర్మాణం చేపట్టారు. రూ.4 కోట్లతో 15 ప్లాట్ఫాంలతో నిర్మిస్తున్నారు. అక్కడే పాస్ కౌంటర్, కంప్యూటర్ గది, ప్రయాణికులు సేద తీరడానికి గదులు నిర్మిస్తున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంతో పచ్చదనం
గద్వాల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే తలంపుతో రూ.581 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకం చేపట్టారు. ప్రసుత్తం పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 48,254 మంది వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రూ.84.16 కోట్లు ఖర్చు చేశారు. రూ.2 కోట్లతో విద్యుత్ ఎస్ఈ కార్యాలయం నిర్మించారు.
మిషన్ భగీరథతో తీరిన దాహార్తి
డబుల్బెడ్రూం ఇండ్లు
సంక్షేమ పథకాలకు 1,935 కోట్లు
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. ఈ నాలుగున్నర ఏండ్ల కాలంలో కేవలం గద్వాల నియోజకవర్గంలో మొత్తం రూ.1,935 కోట్లు ఖర్చు చేసింది.
సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి
సీఎం కేసీఆర్ గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అండదండలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఉమ్మడి పాలనలో ఆమడ దూరంలో నిలిచిన ప్రగతి నేడు పరుగులు పెడుతున్నది. నిధులు ఇస్తున్న అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉంటారు.
– ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి