హైదరాబాద్ : రైతులకు అధిక రుణాలిచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) బ్యాంకర్ల(Bankers)కు విన్నవించారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల( State Level Bankers ) సమావేశంలో ఆయన మాట్లాడారు. అనతి కాలంలోనే తెలంగాణ దేశ వ్యవసాయరంగం(Agricultural)లో అగ్రగామిగా ఎదిగిందన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధితో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయని, అందుకు తగ్గట్లుగా ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు విరివిగా రుణాలివ్వాలని కోరారు. రాష్ట్రంలో పంటల మార్పిడికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తుందన్నారు. బ్యాంకర్లు ఆయిల్ ఫామ్(Oil Farm) సాగుకు రుణాలు అందింలని సూచించారు.
డెయిరీ రంగం బలోపేతం చేసేందుకు అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సహకరించాలన్నారు. బ్యాంకులు కేవలం పట్టణాలలోని ఆస్తులు, భూములనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయన్నారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే విదేశీ విద్య బ్యాంకు రుణాల గరిష్ట పరిమితిని రూ.7.5 లక్షల నుంచి పెంచాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గ్రామీణ ప్రాంతాల భూముల పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
2022 – 23 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి బ్యాంకులు ఇచ్చే రుణాల లక్ష్యంలో 62 శాతమే పూర్తయిందని, ఈ విషయంలో బ్యాంకులు మరింత ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు అమిత్ జింగ్రాన్, జీఎం నాబార్డ్ డాక్టర్ వై.హరగోపాల్, ఆర్బీఐ డీజీఎం కేఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.