(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఎనిమిదిన్నరేండ్ల బీజేపీపాలనలో అలుముకొన్న చీకట్లను పటాపంచలు చేస్తూ, రైతన్నను నిజమైన రారాజుగా మార్చడమే ధ్యేయంగా.. సీఎం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ శంఖారావం బీఆర్ఎస్కు సర్వత్రా మద్దతు లభిస్తున్నది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ కేసీఆర్ చేస్తున్న ధర్మయుద్ధానికి ఇప్పటికే ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో పాటు సీపీఐ, సీపీఎం పార్టీ ముఖ్య నేతలు సంఘీభావం తెలియజేశారు. తాజాగా జాతీయ రైతు నేత, ఎమ్మెస్పీ గ్యారెంటీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజుశెట్టి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధి పనుల ద్వారా సీఎం కేసీఆర్ యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించారని అన్నారు. దేశాభివృద్ధికి ఒక ప్రత్యామ్నాయ రైతు ఎజెండాతో ముందుకు వస్తున్న కేసీఆర్కు భావి ప్రధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని కొనియాడారు. దేశంలో కులం, మతం ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు సమష్టి ప్రయోజనాల కోసం రైతు అజెండాతో ప్రభుత్వాన్ని ఏర్పరచలేమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మీ అభిప్రాయం?
గత ఎనిమిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. తలసరి ఆదాయం పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ఎన్నో సంక్షేమ పథకాలతో బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారు. వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్నో అవార్డులు తెలంగాణకు దక్కాయి. ఒక విధంగా చెప్పాలంటే చిన్న రాష్ర్టాలు మనుగడ సాధించలేవనే లోపభూయిష్ట ఆలోచనలను కేసీఆర్ పటాపంచలు చేశారు. ఇప్పుడు తెలంగాణ మాడల్ దేశానికి అవసరం.
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్కు అవకాశాలు ఎలా ఉన్నాయి?
దేశంలో కులం, మతం ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు సమష్టి ప్రయోజనాల కోసం రైతు అజెండాతో ప్రభుత్వాన్ని ఏర్పరచలేమా? అన్నది మన అందరి ముందున్న ప్రశ్న. నా ఆలోచన ప్రకారం.. ఒక కామన్ మినిమవ్ు ప్రోగ్రావ్ు (సీఎంపీ)తో దేశంలోని అన్ని సంఘాలు ఒక ఫెడరేషన్గా ఏర్పడితే రాజకీయ శక్తిగా మారవచ్చు. దేశంలో బలమైన ప్రతిపక్షం లేదు. కాబట్టి దీనికోసం కేసీఆర్ నాయకత్వంలో మేము పని చేయడానికి సిద్ధమే. అవకాశాలు సృష్టించుకోవడమే రాజకీయ స్వభావం. కేసీఆర్ వంటి అపర చాణక్యుడికి ఇది ఒక లెక్క కాదు. భవిష్యత్తులో బీఆర్ఎస్ తప్పకుండా దేశ రాజకీయాలను శాసిస్తుంది.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న కేసీఆర్ నినాదం దేశవాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఈ నినాదం చాలా దూరదృష్టితో కూడినది. 30 సంవత్సరాల భవిష్యత్తు రాజకీయం దీంట్లో ఇమిడి ఉంది. వ్యక్తిగత స్వార్థం కంటే సామూహిక సామాజిక ప్రయోజనాలు దీంట్లో దాగి ఉన్నాయి. ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదంతో ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రయోజనం పొందారు. కానీ, కేసీఆర్ నినాదం జాతి ప్రయోజనాల కోసం వచ్చింది. దేశంలో మేధావి వర్గం ఇప్పుడిప్పుడే ఈ నినాదంపై చర్చ ప్రారంభించింది. భవిష్యత్తులో ఇదొక అనుసంధాన శక్తిగా మారుతుంది.
రైతు ఉద్యమంలోకి మీరు ఎలా వచ్చారు?
1990లో అప్పటి ప్రముఖ రైతు నాయకుడు, ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన శరద్ జోషితో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రజల విరాళాలతో 2002లో స్వతంత్రంగా జిల్లా పంచాయత్కు ఎన్నికయ్యాను. ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఆహ్వానాన్ని తిరస్కరించి స్వాభిమాన్ శేత్కరీ సంఘటన్ స్థాపించా. ప్రజల విరాళాలతోనే 2004లో మహారాష్ర్ట అసెంబ్లీలో ప్రవేశించా. ఈ విరాళాల సహకారం అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మళ్లీ రైతుల సహకారంతో దేశవ్యాప్తంగా ఉద్యమించాలని 2009లో పార్లమెంటులో అడుగు పెట్టా.
ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతో నేషనల్ అలయన్స్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ (ఎన్ఏఎఫ్ఏ) స్థాపించా. 2017లో మధ్యప్రదేశ్లో రైతులపై జరిగిన కాల్పుల తర్వాత ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేసీసీ) ఏర్పడింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న 207 రైతు సంఘాలు భాగస్వామ్యం అయ్యాయి. రుణమాఫీ, కనీస మద్దతు ధర అంశాలపై ‘జన్ సాంసద్’ కూడా నిర్వహించాం. 2018లో పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టే ప్రయత్నం కూడా చేశాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మొదటగా ఐదుగురు సభ్యులతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చాలో నేను కూడా ఒకడిని. కరోనా రావడంతో నేను దూరం అవ్వగా రాకేశ్ టికాయిత్, యోగేంద్ర యాదవ్ దీన్ని నడిపించారు. ప్రస్తుతం ఎమ్మెస్పీ గ్యారెంటీ కిసాన్ మోర్చాకు నాయకత్వం వహిస్తున్నా.
వ్యవసాయ సమస్యలపై జాతీయ పార్టీల దృక్పథం ఎలా ఉంది ?
దురదృష్టవశాత్తూ ఏ జాతీయ పార్టీకి కూడా వ్యవసాయ విధానాలపై స్పష్టమైన దృక్పథం లేదు. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంక్లిష్టమైనదే కాకుండా బహురూపమైనది. కార్పొరేట్ల ఒత్తిడిలో గ్రామీణ భారతానికి దశ-దిశ లేకుండా పోయింది. నాయకత్వ సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీకి విధివిధానాలపై దార్శనికత లోపించింది. బీజేపీకి మొదటినుంచి రైతులపై ప్రేమ లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, మూడు నల్ల చట్టాలను ఏకపక్షంగా తీసుకురావడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇక కమ్యూనిస్టు పార్టీలది వితండవాదం. మల్టీ స్టేట్ పార్టీలుగా కొనసాగుతున్న ఏ ఇతర పార్టీకి కూడా జాతీయ విధానం లేదు. ఎన్నో అధ్యయన అంశాల ప్రకారం దేశంలో కేవలం పది శాతంలోపే రైతులు ఎమ్మెస్పీ కిందకు వస్తున్నారంటే ఎంత దుర్భరమైన విధానాలు కొనసాగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బీజేపీ తెచ్చిన మూడు చట్టాల వల్ల నష్టమేమిటి?
ఈ మూడు నల్ల చట్టాలు ఎంతో లోపభూయిష్టమైనవి. చిన్న రైతులు కూలీలుగా మిగిలిపోయే ప్రమాదముంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కార్పొరేట్ల గుత్తాధిపత్యానికి అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా
పరిస్థితి ఉండేది. భవిష్యత్తులో బీజేపీ మళ్లీ ఏదో రూపంలో ఈ చట్టాలను తెచ్చే ప్రమాదం ఉంది.
ప్రధాని మోదీతో మీ అనుభవాలు?
ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపీనాథ్ ముండే ద్వారా ఆయన నుంచి పిలుపు వచ్చింది. 2013లో అహ్మదాబాద్ వెళ్లి మోదీని కలిశాను. జాతీయ రాజకీయాల్లో ప్రవేశానికై దేశవ్యాప్తంగా రైతుల మద్దతు కోసం తనకు సహకరించాలని ఆయన కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే సహకరిస్తామని హామీ ఇచ్చా. కానీ దేశ ప్రధాని అయ్యాక యావత్తు రైతాంగం ఆశల్ని ఆయన వమ్ము చేశారు. ప్రధాని మోదీ కొల్హాపూర్లో మాట్లాడిన ప్రసంగ పాఠం ఇప్పటికీ నా వద్ద ఉంది.
బీఆర్ఎస్ ఎదుగుదలకు మీ సహకారం ఎలా ఉండబోతుంది?
ప్రస్తుతం ఎమ్మెస్పీ గ్యారెంటీ కిసాన్ మోర్చాలో 207 సంఘాలున్నాయి. వీటన్నింటినీ మూకుమ్మడిగా బీఆర్ఎస్ వైపు తీసుకురావడంలో నా వంతు కృషి చేస్తా. ఇప్పటికే చెప్పినట్టు రేపటి సంకీర్ణ ప్రభుత్వ అవకాశాల పరంగా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రధాని అభ్యర్థిత్వానికై ముందువరుసలో ఉండి బలపరుస్తా. జాతిహితం కోసం, దేశ ప్రజల కోసం, రైతాంగ సంక్షేమం కోసం ‘అబ్ కీ బార్ బీఆర్ఎస్ సర్కార్’ అనే స్ఫూర్తితో ముందుకు వస్తా.
భవిష్యత్తు ప్రధానిగా కేసీఆర్ను మీరు సమర్థిస్తారా?
తప్పకుండా.. దేశంలో ప్రధాని పదవికి పోటీపడుతున్న నాయకులకు చాలా పరిమితులున్నాయి. ఒకరు వయసు సమస్యలు ఎదుర్కొంటే మరొకరు మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. నూతనంగా ఎదుగుతున్న మరో నాయకుడికి పరిమితమైన దృక్పథం ఉంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అపర భగీరథుడుగా, అపర చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ రాజకీయ దురంధరుడు. ఆయన ఆలోచనలో స్పష్టత ఉంటుంది. పదునైన వాగ్ధాటితో ప్రజలను సమ్మోహితం చేయడం ఆయనకే సాటి. అన్నిటికంటే ముఖ్యంగా దేశ రాజకీయ ప్రస్థానంలో దక్షిణ భారతానికి సరైన ప్రాతినిధ్యం లభించలేదు. కాబట్టి ప్రధాని పదవికి కేసీఆర్ అన్ని రకాల అర్హుడే.
ముఖ్యమంత్రి కేసీఆర్తో మీ సాన్నిహిత్యం?
2009 నుంచి 2014 వరకు మహారాష్ట్ర నుంచి మా సంస్థ స్వాభిమాని శేత్కరీ సంఘటన్ ద్వారా స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించా. అప్పటికే తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నది. రైతుల పక్షపాతిగా మొదటినుంచి అధికార వికేంద్రీకరణను సమర్థిస్తాను. లోక్సభలో జరిగిన తెలంగాణకు సంబంధించిన ప్రతి సమస్య మీద నా వంతుగా అప్పటి టీఆర్ఎస్ సభ్యులకు మద్దతిచ్చాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పరిచయం ఏర్పడింది. అంతేకాకుండా ఢిల్లీలో జరిగిన కాన్స్టిట్యూషన్ క్లబ్ సమావేశాలకు నేను హాజరవుతూ ఉండేవాన్ని. 2007లో తెలంగాణ నుంచి ‘చలో ఢిల్లీ’ పేరిట పాదయాత్రగా వెళ్తున్న రైతుల బృందానికి కొల్హాపూర్లో లక్షమందిలో సన్మానం చేశాం.