వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/కులకచర్ల: ఓ మహిళా రైతు బతికుండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించి రైతుబీమా కొట్టేశారు. రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్కు చెందిన మహిళారైతు చంద్రమ్మకు 1.30 ఎకరాల వ్యవసాయభూమి ఉన్నది. ఆమెకు క్రమంతప్పకుండా రైతుబంధు సాయం అందుతున్నది. గత రెండుపర్యాయాలు రైతుబంధు సొమ్ము ఆమె ఖాతాలో జమకాలేదు. రైతు బతికిఉండగానే చనిపోయినట్టుగా పత్రాలు తయారుచేసి రైతుబీమా పొందుతున్నారంటూ గ్రామానికి చెందిన ఒకమహిళ వ్యవసాయాధికారులకు ఫిర్యాదుచేసింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకివచ్చింది.
చంద్రమ్మ చనిపోయినట్టు నకిలీపత్రాలతో బీమాసొమ్ము పొందినట్టు తేలింది. 14-09-2020న చంద్రమ్మ మృతిచెందినట్టుగా రైతుబంధు గ్రామ కో-ఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి 30-09-2020న డెత్సర్టిఫికెట్ సృష్టించారు. జిరాక్స్షాపులో మరణధ్రువీకరణ పత్రం కొనుగోలుచేసి పంచాయతీ ముద్రలను నకిలీవి తయారుచేయించాడు. బీమా క్లెయిమ్కోసం పత్రాలు నింపి గ్రామంలో చనిపోయిన ముగ్గురు రైతుల క్లెయిమ్ ఫైళ్లతోపాటు అధికారులకు అందజేశాడు.
ఒకేసారి నాలుగు ఫైళ్లు రావడంతో వ్యవసాయాధికారులు విచారణ లేకుండానే వాటిని బీమాకోసంపంపించారు. బీమాపాలసీ నంబర్: 872649, పట్టాదారు పాసుపుస్తకం నంబర్ టి:07090160075కు సంబంధించి చంద్రమ్మ కొడుకు, నామినీ బాలయ్య ఖాతానంబర్ : 62311712754లో 2020 డిసెంబర్9న బీమా ైక్లెమ్ అయింది. వడ్ల డబ్బులు బాలయ్య ఖాతాలో పడ్డాయని నమ్మించి అతడి ఖాతా నుంచి రాఘవేందర్రెడ్డి పలుదఫాలుగా డబ్బులు తీసేసుకున్నాడు. రైతుబీమా డబ్బులు దుర్వినియోగమైనట్టు తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు గురువారం గ్రామానికి చేరుకుని పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. డెత్సర్టిఫికెట్ తీసుకున్న తేదీని విచారించగా.. పంచాయతీ నుంచి తీసుకోలేదని తేలింది. అధికారులు రాఘవేందర్రెడ్డి, బాలయ్యపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు.