నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల తో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మోసపూరిత ఆలోచనలతో రద్దు చేసిన 3 నల్ల చట్టాలను మరో రూపంలో అమలు చేసేందుకు సిద్ధపడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
రైతు విమోచన చట్టం, విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దుచేయాలని వారు డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో వ్యవసాయరంగం నిర్వీర్యమై రైతులు మరింత నష్టపోతారని తెలిపారు. పెట్టుబడిదారి, పారిశ్రామిక, కార్పొరేట్, భూస్వామివర్గాలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తూ, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని మోదీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలు, రైతు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యా ల సమయంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు బడ్జెట్లో నిధులు, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర విధానాల వల్ల వ్యవసాయ రంగం, ఆధారిత రంగాలపై ఆధారపడ్డ మెజార్టీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50శాతం అదనంగా కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.