హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 3 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వం ఏర్పాటుచేయతలపెట్టిన ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన ప్రకటనపై రైతులు భగ్గుమన్నారు. ఈ ప్రకటనతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధుల్లో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ఫార్మాసిటీ ఏర్పాటు ఇక లేనట్టేనని తేలిపోవడంతో తమ భూములు వెనక్కి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ భూముల్లో రోడ్లు వేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించింది. మౌలిక సదుపాయలు, విద్యుత్తు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం బిట్లుగా విభజించి వేలం వేసే అవకాశం ఉన్నదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ
రంగారెడ్డి జిల్లా పరిధిలో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో దాదాపు 12,300 ఎకరాల భూమిని సేకరించింది. మొదటి దశ అనుమతులు వచ్చాయి. తుదిదశ అనుమతులు రాగానే అప్పటికే దరఖాస్తు చేసుకున్న 300-350 కంపెనీలకు కేటాయింపుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండగా, దాదాపు మూడునాలుగువేల ఎకరాల్లో రైతుల నుంచి సేకరించిన భూములు ఉన్నాయి.
రైతులకు పట్టా భూమికి ఎకరాకు రూ.16.5 లక్షలు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.8.5 లక్షల వరకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. దీంతోపాటు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇంటిస్థలం ఇచ్చేందుకు కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1400 ఎకరాల భూమిని సేకరించి లేఅవుట్ను అభివృద్ధి చేసి ఎకరాకు 121 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాటును కూడా పంపిణీ చేసింది. భూములు కోల్పోయిన రైతు కుటుంబాల్లోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కందుకూరు మండల పరిధిలో 1400, యాచారం మండల పరిధిలో 3,600 మందిని గుర్తించారు. వీరిలో సాంకేతిక అర్హతలు లేని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు డ్రైవ్ చేపట్టారు. ఇలా చివరి దశలోకి వచ్చిన ఫార్మాసిటీ ఏర్పాటును రేవంత్రెడ్డి సర్కారు ఇప్పుడు రద్దుచేయడం అందరినీ గందరగోళంలోకి నెట్టింది.
‘కాలుష్య కారకమైన ఫార్మాసిటీ నగరానికి సమీపంలో కాకుండా సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలి’
– డిసెంబర్ 13న సమీక్షలో ఫార్మాసిటీకి బదులుగా ఆ భూముల్లో మెగాసిటీ ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రకటన.
‘ఔటర్ రింగురోడ్డు-ట్రిపుల్ ఆర్ మధ్యలో పారిశ్రామికవాడల గుర్తింపు కోసం 500 నుంచి వెయ్యి ఎకరాల భూసేకరణ చేయండి’
– డిసెంబర్ 18న సమీక్షలో అధికారులకు రేవంత్ ఆదేశం.
ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు
– జనవరి ఒకటో తేదీన మీడియాతో చిట్చాట్ సందర్భంగా రేవంత్రెడ్డి
ఔటర్ రింగ్రోడ్డు – ట్రిపుల్ ఆర్ మధ్య మూడువేల ఎకరాల్లో వివిధ ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఫార్మాసిటీ విధానం సరైంది కాదు. అందుకే దానిని రద్దు చేసి, అక్కడ శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
– నగరంలో శనివారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశంలో డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క.