కమలాపూర్, నవంబర్ 10: వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కూలీల కొరత ఏర్పడుతుండటంతో పనులు చేపట్టడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు సాఫీగా సాగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుండటంతో రైతులు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన రైతు మిల్కూరి శ్రీధర్ యంత్రం సహాయంతో గన్నీ సంచుల్లో వరి ధాన్యం లోడింగ్ చేస్తుండటం పలువురిని ఆకర్షించింది. వ్యవసాయ అధికారుల సలహాతో రూ.1.65 లక్షలు వెచ్చించి వరి ధాన్యం సంచుల్లో నింపే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. ఇది గంటకు 50 నుంచి 70 బస్తాలు నింపుతుంది. గంట సేపు నడిపితే లీటర్ పెట్రోల్ ఖర్చవుతున్నది. తక్కువ ఖర్చుతో పని పూర్తవుతున్నదని రైతు శ్రీధర్ తెలిపారు.