హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): జాతీయ రైతు ఐక్య సంఘటన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావే ప్రేరణ అని జాతీయ కిసాన్ ఆందోళన్ నేత, జయప్రకాశ్నారాయణ్ ప్రధాన అనుచరుడు ప్రొఫెసర్ రాకేశ్ రఫీక్ కొనియాడారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను నరేంద్రమోదీ సర్కార్ ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాల రైతులను ఐక్యం చేయడంతోపాటు, దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవసాయ విధానాలపై సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇవీ..
దేశంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మీరు ప్రస్తుతం దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా విశ్లేషిస్తారు?
నా జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాను. అనేక విధానాల రూపకల్పనలో మా లాంటి వాళ్లు ఎంతో మంది భాగస్వాములయ్యారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అభాసుపాలుచేస్తూ తమ ఇష్టారీతిగా పాలన సాగించిన రోజులను చూడలేదు. కానీ, గత ఎనిమిదేండ్ల నుంచి ప్రజాస్వామ్యం స్థానంలో విచ్చలవిడి కార్పొరేట్స్వామ్యాన్ని చూస్తున్నాం. దీని నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే రైతుల సమస్యలు అర్థమవుతాయి. ప్రజాస్వామ్య విలువలకు తావులేని పాలన దేశానికి మంచిది కాదు. ప్రజలను కేవలం వినియోగ వస్తువులుగా పరిగణిస్తూ సాగుతున్న పాలన ఈ దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. దేశానికి రైతే రాజు అంటున్న పాలకులే అందమైన మాటలతో అన్నదాతలకు మరణశాసనాలు రాస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్న రైతు.. దళారీ వ్యవస్థ చేతిలో కీలుబొమ్మగా మారిండు. ఏం చేసినా తమను అడిగేవాడు లేడు అన్న ధీమాతో పాలకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు, ప్రత్యేకించి నీటి వినియోగానికి సంబంధించి కేంద్రానికి నిర్దిష్ట విధానమే లేదు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే లేదంటారా?
సమస్య పరిష్కారం కావాలని అందరికీ ఉంటుంది. కానీ, ఎక్కడివారక్కడ కూర్చొని తమ సమస్య పరిష్కారం కావాలని కలలు కంటే కుదరదు. అందుకే దేశంలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నవారిని, పోరాడుతున్నవారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకే మేము ఇక్కడికి వచ్చాం. అనేక అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్తో రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించాం. వారం పదిరోజుల్లో మరోచోట సమాలోచనలు చేస్తాం.
గుజరాత్ మాడల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంత?
ఆ భ్రమలను దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే తొలగించుకొంటున్నారు. గుజరాత్ మాడల్ అంటే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోకపోవడమా? నిరంతర కరెంట్ కోతలతో గుడ్డి గుజరాత్ (బ్లైండ్ గుజరాత్)గా ఉండటమా? వర్గ వైషమ్యాలతో నిత్యం కొట్టుకోవటమా? ఎందులో గుజరాత్ మాడల్ను ఆచరించాలి? ఇక ఢిల్లీ అనేది పూర్తిగా పట్టణ రాష్ట్రం. అక్కడ విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. అవి కూడా అక్కడ అత్యంత ఖరీదైన సౌకర్యాలుగా మారాయి. రైతులు అంతగాలేని ఢిల్లీ రాష్ర్టానికి రైతు సమస్యలు ఎలా తెలుస్తాయి? ఏ రకంగా చూసినా గుజరాత్ మాడల్ విఫలైంది. ఢిల్లీకి అసలు మాడలే లేదు. ఇప్పుడు దేశం తెలంగాణ మాడల్ను కోరుకొంటున్నది. రాజకీయ లాభనష్టాలతో బేరీజు వేయడాన్ని పక్కనపెట్టి వాస్తవాల ఆధారంగా మాట్లాడితే కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణలో అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయి. రైతులకు ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన కరెంట్ ఇవ్వటం విప్లవాత్మకం.
దేశమంతా కరెంట్ కోతలతో కొట్టుమిట్టాడుతుంటే తెలంగాణలో మాత్రమే ఆ సమస్య ఎలా పరిష్కారమైంది? రైతులకు ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం ఎలా అందిస్తున్నది? దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయి కుటుంబాలు వీధిన పడుతుంటే తెలంగాణలో మాత్రమే రూ.5 లక్షల రైతుబీమా ఎందుకు ఉన్నది? దళితబంధు పథకం కింద రూ.10 లక్షల సాయం అందించడం ఎలా సాధ్యమవుతున్నది? తెలంగాణలో జరిగినట్టు గరీబ్ కల్యాణ్ దేశమంతా ఎందుకు జరగటం లేదు? సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తెలంగాణ మాదిరిగా మిగిలిన రాష్ర్టాలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నాయి? ఇవన్నీ దేశముందు చర్చనీయాంశాలుగా మారాయి. అందుకే తెలంగాణ ప్రయోగమే దేశమంతా జరగాలని కోరుకొంటున్నాం. దేశంలో నెలకొన్న పరిస్థితులను దగ్గరి నుంచి చూసిన అనుభవంతో చెప్తున్నా.. సీఎం కేసీఆర్ లాంటి విజనరీ లీడర్ లభించటం తెలంగాణ ప్రజల అదృష్టం.
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తున్నామని కేంద్రం పదే పదే చెప్తుండటంపై మీరేమంటారు?
తమకు అనుకూలమైన వారికి ప్రయోజనాలు కల్పించేందుకు పెట్టుకున్న అందమైన పేరు సంస్కరణ. దేశంలో రావాల్సింది రిఫార్మ్స్ కాదు రెవల్యూషన్. విప్లవమంటే సా యుధులై సమస్యలను పరిష్కరించుకోవటం కాదు. సామూహిక ప్రయోజనం కోసం రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో శక్తులన్నీ కలిసి పనిచేసి సమాజంలో మార్పులు తేవడం. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కేవలం ప్రజా ఉద్యమాల నిర్వహణ మాత్రమే కాకుండా పార్లమెంటరీ ప్రక్రియలో భాగస్వామ్యం కావటమనే తెలంగాణ మాడల్లో వెళ్తే సమస్యలకు మరింత సులువుగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ విషయంలో అది సాధ్యమైనప్పుడు దేశ రైతుల విషయంలోనూ తప్పక సాధ్యమవుతుందన్న దృఢ విశ్వాసంతో హైదరాబాద్ నుంచి వెళ్తు న్నాం. దీనిపై విస్తృతంగా చర్చిస్తాం.
26 రాష్ర్టాల్లో రైతు ఉద్యమాలతో సంబంధమున్న నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఇక్కడికి రావడంలోని ఆంతర్యం ఏమిటి?
ఆశను సజీవంగా ఉంచుకోవటం, దాన్ని సాకారం చేసుకోవాలనే సంకల్పం మాత్రం ఉంటే సరిపోదు. ఆ సంకల్పానికి స్పష్టమైన దృక్పథం, ఆచరణ ఉండాలి. ఆ ఆచరణకు మార్గదర్శిగా మాకు కేసీఆర్ కనిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రైతు ఐక్య సంఘటన్కు కేసీఆరే ప్రేరణ. రైతుల పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండటం.. సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని ప్రకటించి, ఆచరణలో చూపడాన్ని కేసీఆర్లో మేము గమనించాం. స్వరాష్ట్ర ఉద్యమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిన కేసీఆర్కు తెలంగాణలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు. తెలంగాణ దృక్కోణం నుంచి దేశ పరిస్థితులను అవగాహన చేసుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి అందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగే నేర్పు కేసీఆర్కు మాత్రమే ఉన్నది. ప్రజాసమస్యల పట్ల ఆయనకున్న లోతైన అవగాహన మమ్ములను విశేషంగా ఆకట్టుకొన్నది. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం సాధించలేని విజయాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేవలం 8 ఏండ్లలోనే సాధించడంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ వద్ద అక్షయపాత్ర గానీ, కామధేనువు గానీ లేదు. ఆయనలో చిత్తశుద్ధి ఉండటం వల్లే ఇవ్వాళ తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది.
‘పుటుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది’ అని ప్రజాకవి కాళోజీ కీర్తించిన నాయకుడు లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ). ఆ మహా నాయకుడి ప్రధాన అనుచరుల్లో రాకేశ్ రఫీక్ ఒకరు. తన జీవితంలో 40 ఏండ్లపాటు ఎన్నో ప్రజా, రైతు ఉద్యమాలను నడిపించిన ఉద్యమగొంతుక రాకేశ్ రఫీక్ది. హిందూ-ముస్లిం ఐక్యతను చాటాలన్న జేపీ పిలుపుతో నాడు ఎంతో మంది హిందూ నాయకులు ముస్లిం పేర్లను, ముస్లిం నాయకులు హిందూ పేర్లను పెట్టుకొన్నారు. అలా పేర్లు పెట్టుకొన్న జేపీ అనుచరుల్లో రాకేశ్ రఫీక్ ఒకరు. జేపీ మూవ్మెంట్ సీనియర్ లీడర్గా ఆయన జాతీయ కిసాన్ ఆందోళన్లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు.