నెక్కొండ, మార్చి 3: పేరుకే రెండున్నరల ఎకరాల భూమి.. చెరువు అలుగుపడినప్పుడల్లా వర ద ముంపులోనే పంటలు.. ఫలితం చేలో క్రమేపి దమ్ముపోతూ దిగుబడి నానాటికి తగ్గుముఖం.. అయినా గుండెల నిండా ఆశలు నింపుకొన్న ఆ రైతు.. గీతకార్మిక వృత్తికి తోడు పుట్టుకతోనే మొదలెట్టిన వ్యవసాయాన్ని గంపెడాశతో సాగుచేస్తూ ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో శనివారం ఉరేసుకొని తనువు చాలించిన మందపురి భిక్షపతి (48) కుటుంబ సభ్యులను ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ పలకరిస్తే కన్నీటిధారలే కానవచ్చాయి. భిక్షపతి కుటుంబానికి చెరువు వరదపారే ప్రాంతంలో రెండున్నర ఎకరాల సాగుభూమి ఉన్నది. మృతుడికి భార్య సునీతతోపాటు నలుగురు సంతానం. వీరిలో అమ్మాయి వివాహం చేయగా, ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు డిగ్రీ చదువుతుండగా, పెద్దకుమారుడు ప్రైవేటుగా పనిచేసుకుంటున్నాడు. పెద్దకుటుంబం కావడంతో కుటుంబ పోషణ భారం కాసింత ఎక్కువే. ఐదేండ్ల కిందట గ్రామంలో అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడు. కొద్దోగొప్పో బకాయిలు చెల్లిస్తూ పంట సీజన్లో అప్పులు తెస్తూ వ్యవసాయాన్ని నెట్టుకొచ్చాడు.
రెండెకరాలు అమ్మి అమ్మాయి పెండ్లి చేశాడు.ఖర్చులకు తగ్గట్టు ఆదాయం లేక నానాటికి అప్పులభారం పెరుగుతూ వచ్చింది. ఓవైపు అప్పులు తీరేందుకు తాళ్లు ఎక్కుతూ గీతకార్మిక వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు అర ఎకరం భూమిని సాగు చేస్తున్న ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చేసేదేమిలేక భూమి అమ్మిన ఆసామికే గోడువెల్లబోసుకొని ఆ రెండు ఎకరాలను సైతం కౌలుకు తీసుకొని రెండున్నర ఎకరాల్లో వరిని మూడేండ్లుగా పండిస్తూ వ చ్చాడు. ఇది బెడిసి కొట్టడంతో మళ్లీ కౌలు వదులుకొని నిరుడి నుంచి అర ఎకరం మాత్రమే సాగుచేస్తున్నాడు. ఇల్లు కట్టేందుకు, పిల్ల పెండ్లికి, వ్యవసాయ అప్పులు, దవాఖాన ఖర్చులు, కుటుంబ పోషణ ఇలా అన్నీ కలిసి దాదాపు రూ.12 లక్షల వరకు అప్పులయ్యాయని తెలుస్తున్నది. గీత కార్మిక సంఘంలోనూ చిట్టీ బాపతు డబ్బులు కట్టాల్సి ఉం డగా ఎక్కడా కొత్తగా అప్పు పుట్టకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉరేసుకొని ఆ రైతు బలవన్మరణం పాలయ్యాడు. అప్పుల ఊబిలో ఉన్న ఆ రైతు కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.