హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ)/మియాపూర్: వాయు కాలుష్యాన్ని నివారించేందుకు హైదరాబాద్-విజయవాడ రూట్లో నడుపుతున్న ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల చార్జీలను టీఎస్ఆర్టీసీ తగ్గించింది. కొత్త బస్సుల ప్రారంభం సందర్భంగా నెలరోజుల పాటు చార్జీల తగ్గంపును అమలు చేస్తామని సంస్థ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. మియాపూర్ నుంచి విజయవాడకు రూ.830గా నిర్ణయించిన టికెట్ ధరను రూ.750కి, ఎంజీబీఎస్ నుంచి విజయవాడకు రూ.780గా ఉన్న ధరను రూ.710కి తగ్గించినట్టు తెలిపారు. ఈ రూట్లో మంగళవారం 10 బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ దశలవారీగా 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇవి వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపింది.