హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిరా భైరి ఆదివారం హైదరాబాద్లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన కూతురి నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణం. అక్కడే 20 ఏండ్లపాటు ప్రభుత్వ పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండేండ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆమె భర్త రామశంకరయ్య సింగరేణి ఉద్యోగి. ముగ్గురు సంతానంలో ప్రముఖ గజల్స్ గాయని హిమజా రామమ్ ఆమె కూతురే. ఇందిరా ఒకవైపు పిల్లలకు పాఠాలు బోధిస్తూనే తీరిక సమయాల్లో గజల్స్ రాసేవారు. ఆమె ఇప్పటివరకు దాదాపు 600కు పైగా గజల్స్ రాశారు. ఇందిర తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు పేరుతో గజల్స్ సంకలనాన్ని తీసుకొచ్చారు. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధ పోరాటం, మన పండుగలపై అనేక గజల్స్ రాశారు. వీటితోపాటు ఇతర రచనలు, కథల సంపుటాలు అనేకం రాశారు. రావిరంగారావు సాహిత్య కళాపీఠం నుంచి ఇందిర ‘జనరంజక కవి పురసారం’ అందుకున్నారు.
సాహిత్యలోకానికి తీరని లోటు
కవయిత్రి ఇందిరాభైరి మరణం తెలంగాణ గజల్ సాహిత్యానికి తీరని లోటని సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. పలువురు సాహితీ ప్రేమికులు, గజల్ గాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. సోమవారం నిజాంపేటలో ఇందిరా అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.