హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో ‘నమస్తే తెలంగాణ’ ఫేక్ ఐడీతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్నిరోజులుగా ఫేక్ ఐడీలు సృష్టిస్తున్న కొందరు ఊహాజనిత, తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో నమస్తే తెలంగాణ యాజమాన్యం హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సూపరింటెండెంట్లకు, కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫేస్బుక్కు లేఖలు రాసిన సైబర్ క్రైం పోలీసులు.. అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. నమస్తే తెలంగాణ లోగో/మాస్టర్ హెడ్కు కాపీరైట్ ఉన్నదని, ఆ లోగోను వాడి తప్పుడు పోస్టులు సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలోని ఖాతాలు నకిలీవా? అసలువా? అని నిర్ధారించుకోకుండా, అందులోని అంశాలను షేర్ చేస్తే సదరు వ్యక్తులు కూడా నిందితులు అవుతారని స్పష్టం చేశారు.
పోస్టుల షేరింగ్లో యువత జాగ్రత్త
యువత ఏ పోస్టులనైనా సరే నిర్ధారించుకోకుండా షేర్ చేయవద్దు. తమ సొంత, రాజకీయ ప్రయోజనాల కోసం పోస్టులను ఫార్వర్డ్ చేయాలని, షేర్ చేయాలని కొందరు ప్రలోభపెట్టినా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పోస్టుల్లో ఉండే వివరాలు నిజమా? కాదా? అన్నది తెలుసుకోవాలి. ఒకవేళ తెలిసోతెలియకో, అమాయకత్వంతో షేర్ చేసినా, పోస్టుల్లోని సమాచారం తప్పని తేలితే కేసులు నమోదు చేస్తారు. చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ఇలాంటివి యువత బంగారు భవిష్యత్తుకు ఆటంకంగా మారుతాయి. కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు రావు. కేసులు నమోదైనట్టు తెలిస్తే ప్రైవేట్ సంస్థలూ తీసుకోవు. కాబట్టి యువత, విద్యార్థులు పోస్టుల షేరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.
లోగోకు కాపీరైట్
నమస్తే తెలంగాణ లోగోకు కాపీరైట్ ఉన్నది. అంటే.. సంస్థ తప్ప వేరెవరూ ఈ లోగోను వాడటానికి వీల్లేదు. సోషల్ మీడియాలో వేరెవరో పోస్ట్ చేసినా, ఆ వార్త నిజమేనా? నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనమేనా? అని నిర్ధారణ చేసుకోవాలి. కాదని లోగో వాడితే చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. భారతదేశ నకలు హక్కుల చట్టం ప్రకారం.. గరిష్ఠంగా మూడేండ్ల వరకు శిక్ష పడుతుంది. అంతేకాదు.. రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తారు.