నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్పోర్టుల తయారీ ముఠాలో మరో సభ్యుడైన తమిళనాడు ఏజెంట్ హబీబుల్లా ఖాదర్ అలియాస్ జాన్ జేవియర్కు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం రిమాండ్ విధించింది. తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై సీఐడీ అధికారులు అతన్ని అరెస్టుచేసి 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. 28 వరకు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమిళనాడు జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతుండటంతో ఈ కేసులో 19వ నిందితుడిగా పీటీ వారెంట్పై అతన్ని అరెస్టు చేశారు. విదేశీయుల కోసం ఉపయోగించే ఫారెనర్స్ చట్టాన్ని తమిళనాడుకు చెందిన భారతీయుడికి ఏ విధంగా వర్తిస్తుందని సీఐడీ అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఈ చట్టం ప్రకారం నమోదైన సెక్షన్లు వర్తించబోవన్నారు. ఫారెనర్స్ చట్టానికి చెందిన సెక్షన్లను రిమాండ్ రిపోర్ట్ నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ తరఫున పీపీ ఇచ్చిన వివరణ సరిపోలేదని ఈ చట్టానికి చెందిన సెక్షన్లను కోర్టు తొలగించి నిందితుడికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది.