హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): అర్హతలు లేకున్నా నకిలీ ఇన్విటేషన్ లెటర్లు, ఐడీ కార్డులతో అడ్డదారిలో అమెరికాకు పంపిస్తామం టూ భారీ మొత్తంలో డబ్బు తీసుకుని రూ.లక్షల్లో మో సాలకు పాల్పడుతున్న నకిలీ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ రాకెట్ గుట్టును ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఆ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులతోపాటు వీసా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కోసం వారి ని ఆశ్రయించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వారి నుంచి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన 16 నకిలీ ఐడీ కార్డులు, 279 పాస్ పుస్తకాలు, 10 నకిలీ ఇన్విటేషన్ లెటర్లు తదితర సామగ్రితోపాటు నిందితుల నుంచి రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి పేరిట బ్యాంకులో ఉన్న రూ. 7,02,970 నగదును ఫ్రీజ్ చేశారు.
అరెస్టయిన నిందితుల్లో సికింద్రాబాద్లోని మచ్చబొల్లారం స్రవంతి నగర్ నివాసి, సెయింట్ ఆంథోనీస్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు గార్లపాటి దుర్గానాగేశ్వర సిద్దార్థ అలియాస్ గార్లపాటి విల్సన్ చౌదరి, అతని వద్ద కమీషన్ ఏజెంట్గా పనిచేస్తున్న ఓల్డ్ అల్వాల్ వాసి నథాల ప్రభాకర్రావు, నకిలీ వీసాల కోసం వచ్చేవారికి ఫైనాన్సింగ్ చేసే బోడుప్పల్ వాసి గొటుకుల నాగార్జున, నకిలీ వీసా పొందేందుకు ఈ ముఠాను ఆశ్రయించిన నిజామాబాద్ జిల్లా బస్సపూర్ వాసి జక్కుల నాగేశ్వర్ ఉన్నారు. ఈ ఘరానా ముఠా వివరాలను మల్కాజిగిరి డీసీపీ జానకి, ఎల్బీనగర్ ఎస్వోటీ డీసీపీ మురళీధర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. నకిలీ వీసాల కోసం ఇప్పటివరకు 60 మంది విల్సన్ను సంప్రదించారని, వారిలో 10 మంది వీసాలు పొందారని, ఈ దందా కోసం ఫైనాన్సర్ నాగరాజు నేరేడ్మెట్లోని జాగృతి బ్యాంకులో ఏకంగా 279 ఖాతాలు తెరిచినట్టు గుర్తించామని వెల్లడించారు.