హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్ వస్తున్నాయని .. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. తాజాగా ముంబై క్రైం బ్రాంచి నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఐఐటీ పీహెచ్డీ స్కాలర్కు రూ.30 లక్షలు కుచ్చుటోపీ పెట్టారని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దని చెప్పారు. జాగ్రత్తగా వ్యవహరించాలని, వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని సూచించారు. డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయవద్దని చెప్పారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయాలని సూచించారు. లేదా స్థానిక పోలీస్స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని వీసీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వివరించారు.