హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారం కలకలం రేపుతున్నది. సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి భారీ ఎత్తున బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు తెలిసింది. గత మార్చి నుంచి డిసెంబర్ మధ్య జారీ అయిన 31,454 ధ్రువపత్రాలు ఈ కోవలోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 27,328 జనన, 4,126 మరణ ధ్రువపత్రాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు. ప్రధానంగా నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్ల పేరిట ఎక్కువ అక్రమాలు జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు, మీ సేవ కేంద్రాల సిబ్బంది కలిసి ఈ వ్యవహారం నడిపినట్టు తెలుస్తున్నది. అక్రమాల గుట్టు తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి నేతృత్వంలో అధికారులు బుధవారం నుంచి విచారణ ప్రారంభించనున్నట్టు తెలిసింది. రద్దుచేసిన ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి దరఖాస్తుదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. వీరందరి ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నందున ఇప్పటికే వారందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం కూడా ఇచ్చారు.
ప్రధానంగా నాన్ అవైలబులిటీలోనే..
జీహెచ్ఎంసీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో 2022 నుంచి ‘ఇన్స్టంట్ అఫ్రూవల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. దవాఖానల్లో జరిగే జనన, మరణాల ధ్రువపత్రాల ఆధారంగా జీహెచ్ఎంసీ పత్రాలు జారీ చేస్తుంది. వివరాలను నమోదు చేసి, సరైన పత్రాలను అప్లోడ్ చేస్తే సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వెంటనే ఆన్లైన్లోనే సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. దవాఖానల్లో కాకుండా ఇంటి వద్ద జరిగే జనన, మరణాల వివరాలు దవాఖానల్లో అందుబాటులో ఉండవు. అందుకే వీటిని నాన్ అవైలబిలిటీగా పేర్కొంటారు. ప్రధానంగా నాన్ అవైలబిలిటీ ఆధారంగా జారీచేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లోనే భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు.