మేడ్చల్, నవంబర్ 7: చక్కటి ప్రణాళిక ఉంటే విదేశీ విద్య సులభమేనని వై-యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు. ఔత్సాహిక విద్యార్థులు ముందుకొస్తే ఈ రంగంలో అపార అనుభవం ఉన్న తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కండ్లకోయ సీఎంఆర్ సెట్లో సోమవారం ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్పై ‘వై-యాక్సిస్’ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫైజల్ హుస్సేన్ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వేల మందికి తమ సంస్థ మార్గదర్శనం చేసిందన్నారు.
ఇంజినీరింగ్ పూర్తిచేసిన 90 శాతం మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కోరిక ఉంటుందని, సరైన మార్గదర్శనం లేకే ఆగిపోతున్నారని చెప్పారు. చదువుల కోసం యూఎస్, కెన డా వెళ్లాలంటే 12 నుంచి 14 నెలలు.. యూ కే, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లాలంటే 7 నుంచి 8 నెలల ప్రాసెస్ ఉంటుందని తెలిపారు. ప్రధానంగా రెజ్యుమె, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమండేషన్ అనే మూడు భాగాలు ఉంటాయని వివరించారు. ఈ సదస్సులో 500 మంది విద్యార్థులు, సీఎంఆర్ విద్యాసంస్థల కార్యదర్శి చామకూర గోపాల్రెడ్డి, సీఈవో అభినవ్రెడ్డి, ప్రిన్సిపాల్ వీఏ నారాయణ, ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారి సంజీవ్, ఈవెంట్ మేనేజర్ గణేశ్ పాల్గొన్నారు.
విదేశీ విద్యకు మా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను విదేశాలకు పంపాలని కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే ప్రణాళిక ముఖ్యం. సరైన మార్గదర్శనం ద్వారానే ఇది సాధ్యం. ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో విదేశీవిద్యపై అవగాహన కల్పించడం హర్షణీయం. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన వై-యాక్సిస్ లాంటి సంస్థలతో విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవచ్చు.
-చామకూర గోపాల్రెడ్డి, కార్యదర్శి, సీఎంఆర్ విద్యాసంస్థలు, కండ్లకోయ
విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే మార్గదర్శనం అవసరం. చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు మా కళాశాలలో చదువుతున్నారు. వారికి విదేశాల్లో చదువుకోవాలనే ఉత్సుకత ఉన్నా.. అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. వై-యాక్సిస్ లాంటి సంస్థ తోడ్పాటు ఉంటే విద్యార్థులు కోరుకున్న దేశంలో, మంచి యూనివర్సిటీలో సీటు సాధించుకొనే అవకాశం ఉంటుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసిన ఫైజల్ హుస్సేన్కు కృతజ్ఞతలు.
– వీఏ నారాయణ, ప్రిన్సిపాల్, సీఎంఆర్ సెట్, కండ్లకోయ