బన్సీలాల్పేట్, జూలై 13: కంటి సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ దవాఖానలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని, చికిత్స కోసం ‘గాంధీకి రండి’ అంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆప్తాల్మాలజీ విభాగాధిపతి డాక్టర్ రవిశేఖర్తో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కరోనా కారణంగా దవాఖానలోని ఆప్తాల్మాలజీ విభాగంలో ఆపరేషన్లు నిలిపివేశామని, నాన్ కొవిడ్ సేవలు పునఃప్రారంభమైన తర్వాత కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించామని చెప్పారు. ఇక నుంచి ‘కాటరాక్ట్’ సర్జరీలు.. అంటే కంటిలో శుక్లాలను తొలగించే ఆపరేషన్లు చేయనున్నట్టు వెల్లడించారు. మూడో అంతస్థులో ఆపరేషన్ థియేటర్తోపాటు 20 పడకలను కంటి రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలను సైతం నిర్వహిస్తామని తెలిపారు.