హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 36 జువెనైల్ జస్టిస్ బోర్డు, డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డు పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి ఆరునెలలు దాటినా స్పష్టత రావడంలేదు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష పెడతారా? లేదా? అని సంశయం వ్యక్తంచేస్తున్నారు. కొంతకాలంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పే రిట కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో పరీక్ష తేదీ ప్రకటించాలని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాల ఆధారంగా జువెనైల్, డిస్ట్రిక్ వెల్ఫేర్ బోర్డులను 2023లో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. చైర్మన్, సభ్యుల నియామకానికి మహిళా శిశు సంక్షేమశాఖ జూలై 22న తొలిసారి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఆశావహుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని అదే ఏడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది. రెండుసార్లు దరఖాస్తులు స్వీకరించగా 2,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండోసారి దరఖాస్తు ప్రక్రియ ముగిసి ఆరునెలలు దాటినా పరీక్ష, ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రకటించలేదు.