Local Train | యాదాద్రి వరకు విస్తరించనున్న లోక్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డికి సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోదీకి చెప్పి ఒప్పించాలన్నారు. ఎంఎంటీఎస్ రైల్వేలైన్, లోకల్ ట్రైన్ను మంజూరు చేయించాలని, జనగామకు లోకల్ రైలు వస్తే.. అటు రైల్వేకు లాభం చేకూరుతుందని, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటని, జనగామతోపాటు చుట్టూ 50 నుంచి 60 కిమీ మేర పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారని లేఖలో వివరించారు.
జనగామ, ఆలేరు, భువనగిరి పట్టణాలతోపాటు, పెంబర్తి, వంగపల్లి, రాయగిరి, బీబీనగర్, ఘట్కేసర్ నుంచి ప్రజలు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు, వివిధ శాఖ ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగించేవారంతా.. వ్యక్తిగత పనుల మీద, రోజువారి కూలీలు, వ్యాపారపరంగా వెళ్లేవారు ఇలా వేలాది మంది నిత్యం రైళ్లల్లో ప్రయాణాలు సాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న అతి కొద్ది రైళ్లల్లో కికిరిసి ప్రయాణాలు చేస్తున్నారని తెలిపారు.
కొన్ని సార్లు రైలు డబ్బాలకు వేలాడుతూ, అత్యంత ప్రమాదకర ప్రయాణాలకు చేయాల్సిన దీనస్థితి నెలకొందని గుర్తు చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్ విస్తరణ, జిల్లా కేంద్రమైన తరువాత జనగామ వరంగల్, కాజీపేటలకు, ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్లకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో కొద్దిరోజుల్లోనే జనగామ అటు కాజీపేట, ఇటు హైదరాబాద్తో కలుస్తాయన్నారు. ముందుగా జనగామ వరకు, ఆ తర్వాత వరంగల్ వరకు దశలవారీగా విస్తరించే అవకాశాలున్నాయని చెప్పారు. రైల్వే లైన్లో లోకల్ రైలు వేస్తే రోడ్లపై రద్దీ కూడా తగ్గి ఈ రెండుదారుల్లో ప్రయాణాలు సులువవుతాయన్నారు.