ఇబ్రహీంపట్నం, జనవరి 17: గ్రామ దేవతలు కొలువుదీరిన ప్రదేశాలకు వెళ్లేందుకు అడిగినంత వెడల్పుతో దారికి స్థలం ఇవ్వని కారణంగా 3 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. ఈ ఘ టన జగిత్యాల జిల్లా ఇబ్రహీంప ట్నం మండలం తిమ్మాపూర్లో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. తిమ్మాపూర్ శివారులోని గ్రామ దేవతల వద్ద కు ముగ్గురు రైతుల పొలాల్లో నుంచి వెళ్లాలి. అమ్మవార్ల దగ్గరికి వెళ్లేందుకు దారి కోసం సదరు రైతుల పొలాల్లోంచి 18 అడుగుల స్థలం ఇవ్వాలని వీడీసీ సభ్యులు హుకుం జారీ చేశారు. 18 అడుగుల స్థలం ఇవ్వలేమని, నాలుగు అడుగులు మాత్రం ఉచితం గా ఇస్తామని రైతులు తేల్చి చెప్పారు. దీనికి ఒప్పుకోని వీడీసీ, ఆ మూడు కుటుంబాలను గ్రామం నుంచి సాంఘిక బహిష్కరణ చేసింది. ఆ కుటుంబాల్లోని వ్యక్తులతో గ్రామస్థులెవరూ మాట్లాడొద్దని, మాట్లాడితే రూ.25 వేల జరిమానా విధిస్తామని, వారి పొలాల్లో కూలీకి వెళ్లవద్దని ఆంక్షలు విధించారు. మూడు కుటుంబాల పెద్దలు ఈ నెల 11న ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా, వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.