హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల ( DRF ) సేవలను ఓఆర్ఆర్ (ORR) పరిధి వరకు విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shantikumari) తెలిపారు. హైదరాబాద్ నగరం తోపాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్ఠ పరిచేందుకు అదనపు సిబ్బందిని, యంత్ర పరికరాలను అందచేయనున్నామని వివరించారు. ఇప్పటికే, జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని, వీటికి తోడు మరో 15 బృందాలను అదనంగా ఏర్పాటు చేసి వీటి సేవలను ఓఆర్ఆర్ వరకు విస్తరించనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నందున, కెమికల్ ఫైర్ ప్రివెన్షన్ కు ప్రత్యేక శిక్షణ తోకూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో 141 సమస్యాత్మక ప్రాంతాల్లో మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పౌరులకు వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
హైదరాబాద్ తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాలలో కూడా డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. దేశంలోని ప్రధాన మహానగరాలైన ముంబయి, ఢిల్లీ , చెన్నై, బెంగుళూరు లలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల పనితీరు పై అధ్యయనం చేయాలని వెల్లడించారు.