హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ) : మలేషియా రాజధాని కౌలాలంపూర్ నగరంలో శనివారం జరుగనున్న తెలంగాణ 12వ ఆవిర్భావ సంబురాలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దీనికోసం రెండు నెలలుగా శ్రమించామని చెప్పారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని, ఇప్పటికే ఆయన కుటుంబ సమేతంగా రావడం ఎంతో ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో మహేశ్ బిగాల ముచ్చటించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ విశేషాలను ఆయన పంచుకున్నారు.
నమస్తే తెలంగాణ: కౌలాలంపూర్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడంలోని ఉద్దేశమేంటి?
మహేశ్ బిగాల: మలేషియాలో వేలాది మంది తెలంగాణవాసులు ఉన్నారు. వారు కూడా నాటి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ సంస్కృతిని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన తీరును ప్రపంచానికి తెలియజెప్పే ఉద్దేశంతోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. గతంలో డాలస్లో నిర్వహించిన వేడుకల స్ఫూర్తితో ఇక్కడ మరింత ఘనంగా జరుపాలని నిర్ణయించినం.
శనివారం సాయంత్రం 3:30 గంటల నుంచి రాత్రి 11 వరకు ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల కోసం అద్భుతంగా ఏర్పాట్లు చేసినం. ఇందుకోసం రెండు నెలల నుంచి రాత్రింబవళ్లు శ్రమించినం. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వేదికను రూపొందించినం. వరంగల్ కాకతీయ కళాతోరణాలు, యాదగిరిగుట్ట ఆలయం, చార్మినార్, బతుకమ్మ, అమరజ్యోతి తదితర చిహ్నాలు ప్రతిష్టించినం. వేదికకు ఇరువైపులా కేసీఆర్, కేటీఆర్ భారీ కటౌట్లను పెట్టినం. అలాగే 14 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినం
తెలంగాణ ధూంధాం నిర్వహిస్తున్నం. ఇందుకోసం అనేకమంది కళాకారులు ఇప్పటికే ఇక్కడికి చేరుకొన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కళాకారులు మానుకోట ప్రసాద్, సందీప్, అంజలి, నృత్య కళాకారులు వర్షిణి, రాజేశ్ ప్రదర్శనలిస్తారు. తెలంగాణ ఆటాపాటలతో ధూంధాం నిర్వహించనున్నారు.

మలేషియాతోపాటు సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. వీరికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినం. వేదికకు నలువైపులా ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చినం. ఈ కార్యక్రమానికి మలేషియాతోపాటు తెలంగాణ, తెలుగు సమాజం తదితర 25 సంస్థలు, సంఘాలు సహకారం అందిస్తున్నాయి.
సభకు హాజరయ్యే అతిథులైన బీఆర్ఎస్ నేతలతోపాటు ప్రతినిధులకు సకల సౌకర్యాలు కల్పించినం. తెలంగాణ వంటకాలైన బోటి, పచ్చిపులుసు, గారెలు, మాంసం, హైదరాబాద్ బిర్యానీ తదితర రుచికరమైన వంటకాలు సిద్ధచేస్తున్నం.
కేటీఆర్ను కలిసేందుకు ప్రవాసీ తెలంగాణవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రసంగం వినేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. మేము ఆహ్వానించిన వెంటనే ఆవిర్భావ ఉత్సవాలకు హాజరయ్యేందుకు కేటీఆర్ అంగీకరించారు. ఆయన ఇప్పటికే సతీసమేతంగా మలేషియా చేరుకొన్నారు.