మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 18 : కొన్ని పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో బీజేపీ, కాం గ్రెస్, బీఎస్పీలకు చెందిన 250 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రేగూరి కృష్ణతోపాటు హన్వాడ మండలానికి చెందిన బజరంగ్దళ్ ప్రముఖ్ బైకాని నర్సింహులు, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన 150 మంది గులాబీ పార్టీలో చేరారు.
వీరికి మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పాలన నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ధ్వజమెత్తారు. కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. కొన్ని పార్టీలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వీటిని ప్రజలు గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దివిటిపల్లి వద్ద ఏర్పాటు కానున్న అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో ఎందరికో ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు.