హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గీత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12.5 కోట్ల ఎక్స్గ్రేషియాను విడుదల చేసినట్టు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గీతవృత్తిలో ప్రమాదానికి గురైన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పంపిణీ చేస్తామని ఎక్సైజ్ భవన్లో శనివారం మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడవృత్తిదారుల కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించనున్నదని, దాని భూమి పూజ కార్యక్రమంలోనే ఎక్స్గ్రేషియాను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
గీత కార్మికులకు అమలు చేసే బీమా కోసం విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం చెందిన గీతకార్మికులకు అందించే ఎక్స్గ్రేషియాను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వారం వ్యవధిలో జమ చేసేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గీత కార్మికులు వారి ఆధార్ కార్డు, బ్యాంకు, లైసెన్సు, నామిని వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు వారంలోపు అందజేయాలని సూచించారు. బాధిత గీత కార్మికులు వారి సమీపంలోని ఎక్సైజ్ స్టేషన్లో వివరాలు అందించాలని చెప్పారు. గాయపడిన కార్మికులు భవిష్యత్తులో చెట్టు ఎక్కలేమని డాక్టరుతో సర్టిఫికెట్ తీసుకొస్తే.. వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.