నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రోసీజర్ ప్రకారం నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పోరేషన్కు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ ఉత్పత్తుల సరఫరా కోసం సోమ్ డిస్టిలరీస్కు బేవరేజ్ కార్పొరేషన్ అమమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. బేవరేజ్ కార్పోరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని తెలిపారు.
రాష్ట్రంలో హోల్సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని మంత్రి జూపల్లి తెలిపారు. డిమాండ్ అండ్ సప్లైని బట్టి కొత్త కంపనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారమే సామ్ డిస్టిలరీస్తో పాటు ఇతర కంపెనీలకు మద్యం సరఫరాకు బెవరేజ్ కార్పోరేషన్ లిమిటెడ్ అనుమతులిచ్చారని తెలిపారు. ఎక్కడా కూడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.