Tummala | ఖమ్మం, నవంబర్ 22: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు తుమ్మల యుగంధర్ తనను చంపే కుట్రలు చేస్తున్నారని విశ్రాంత పోలీస్ అధికారి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని ఆయన స్వగృహంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ఇంట్లో డబ్బులు ఉన్నట్టు భావించి మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా నారాయణరావు, కమర్తపు మురళి, నరేందర్, మందడపు మనోహర్, నాగుల్మీరా, సాధు రమేశ్రెడ్డితోపాటు సుమారు 200 మంది తనపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి వచ్చి కాపాడారని చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై నగర పరిధిలోని ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ కుట్రలకు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు తుమ్మల యుగంధరే కారణమని పేర్కొన్నారు. తనకు రక్షణగా ఉన్న గన్మెన్ను కూడా తుమ్మల తన పలుకుబడిని ఉపయోగించి తప్పించారని ఆరోపించారు.
కొద్దిరోజుల క్రితం తుమ్మల స్వయంగా తనకు కాల్ చేసి బెదిరించారని వాపోయారు. సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుటుంబంతో తనకు 35 ఏండ్ల అనుబంధం ఉందని, అందువల్ల తాను ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్కు మద్దతు తెలిపానని స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణకు మరో రెండు నెలల సమయం ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి పువ్వాడ అజయ్ గెలుపు కోసం పనిచేస్తున్నానని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, వెంకటేశ్వరరావు, జాబిశెట్టి శ్రీనివాసరావు, బిక్కసాని దామోదర్రావు, బిచ్చాల తిరుమలరావు, తూములూరి ప్రసాద్, బండారు శ్రీనివాసరావు, శివప్రసాద్, సుజాతరెడ్డి పాల్గొన్నారు.