హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఒడిశా మాజీ సీఎం, ఆ రాష్ట్ర సీనియర్ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఆయనతోపాటు ఒడిశాలోని కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి, బీజేపీ నేత, గిరిధర్ గమాంగ్ తనయుడు శిశిర్ గమాంగ్ సహ పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసేందుకు అనేక రాష్ర్టాల నుంచి పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు ముందుకు వస్తున్నారు. బీజేపీ అనుసరిస్తున్న విద్వేష, వివక్షాపూరిత వైఖరిని ఎండగట్టగల సత్తా సీఎం కేసీఆర్లోనే ఉన్నాయని, మోదీని ఎదుర్కొనే శక్తియుక్తులు కేసీఆర్లోనే ఉన్నాయనే అభిప్రాయం దేశమంతా పరివ్యాప్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ర్టాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు బీఆర్ఎస్ అధినేతతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. త్వరలో విశాఖపట్నంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తామని తోట చంద్రశేఖర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఒడిశా బీజేపీ, కాంగ్రెస్ల్లో ప్రకంపనలు
ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ ఆదిలోనే భారీ షాక్ ఇచ్చింది. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు శిశిర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం బీజేపీపై చేసిన వ్యాఖ్యలు ఒడిశాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యదర్శి కైలాశ్ కుమార్ ముఖి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ దెబ్బకు ఒడిశాలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు విలవిల్లాడుతున్నాయని ఒడిశా మీడియా కథనాలు చెప్తున్నాయి. ఒడిశా నుంచి శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
5న కేసీఆర్ నాందేడ్ పర్యటన
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం నాందేడ్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, హన్మంత్ షిండే గురువారం పరిశీలించారు. నాందేడ్ పర్యటనలో ముందుగా గురుద్వారా దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం హింగోలీ రోడ్ ఎదురుగా ఉన్న గురుద్వారా సత్కండ్ బోర్డ్ మైదాన్లో బీఆర్ఎస్ చేరికల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం నాందేడ్ సిటీ ప్రైడ్ హోటల్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్కు చేరుకుంటారని తెలుస్తున్నది. అయితే సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన, సమావేశ నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులు లభించటం విశేషం.