KCR | స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ను రాజయ్య ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరిపై అనర్హత వేటు ఖాయమన్నారు. కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. కడియం, దానం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్టేషన్ఘన్పూర్లో ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు.