స్వామీజీలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలంటే సమాజానికి నాలుగు మంచి విషయాలు చెప్పాల్సినవారు. ప్రజలను సన్మార్గంలో నడిపించాల్సిన వారు. కానీ, ఇప్పుడు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల విషయంలో ఓ పీఠాధిపతి రామచంద్రభారతి (అలియాస్ సతీశ్శర్మ), మరో ఆధ్యాత్మికవేత్త సింహయాజి రెడ్ హ్యాండెడ్గా దొరకడం సంచలనంగా మారింది. తమ కార్లలో ఏకంగా డబ్బు సంచులతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రలోభాలకు దిగడం అందరినీ విస్మయపరిచింది.
అత్యంత జుగుప్సాకరమైన, అనైతిక వ్యవహారంలో తలదూర్చి కాషాయానికి కళంకం తెచ్చారని హిందూత్వవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి చర్యలతో భారతీయ ధర్మానికి తలవంపులు తెచ్చారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో పట్టుబడ్డ రామచంద్రభారతి.. జగద్గురు శంకరాచార్య పరంపరగా చెప్పుకొంటూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో కపిలాశ్రమం చీఫ్గా వ్యవహరిస్తున్నారు. ఈయన కేంద్ర హోం మంత్రి అమిత్షాకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అత్యంత సన్నిహితుడు.. అనుయాయుడు. నిరంతరం అమిత్షా వెంట ఉంటారని ఢిల్లీ వర్గాలు చెప్తుంటాయి. ఇక రెండో స్వామి ప్రపన్న శ్రీకరుణాకరన్ వెంకటనాథ సింహయాజి.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో శ్రీమంత్రరాజ పీఠాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో.. ఏపీ, తెలంగాణల్లోని బీజేపీ నేతలతో ఈయనకు దగ్గరి సంబంధాలున్నట్టు సమాచారం. – హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ