ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ)/ తెలుగు యూనివర్సిటీ / ముషీరాబాద్: వ్యక్తిత్వ వికాసానికి పీవీ నరసింహారావు నిలువెత్తు నిదర్శనమని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. పీవీ శత జయంత్యుత్సవాన్ని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్లిష్టపరిస్థితుల్లో పీవీ ప్రధాని పదవి స్వీకరించి అపూర్వ సంస్కరణలు తీసుకొచ్చారని ఆమె పేర్కొన్నారు. పీవీ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సర్వశ్రేయోనిధి వల్లే ఆలయాల జీర్ణోద్ధరణ కొనసాగుతున్నదని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిల్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
సంస్కరణలకు ఆద్యుడు: దేవులపల్లి
దేశఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన ఘనత మాజీ ప్రధాని పీవీకే దక్కిందని తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవుపల్లి ప్రభాకర్రావు అన్నారు. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వీఎస్ జనార్ధనమూర్తి అధ్యక్షతన పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, తోట శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
విలేజ్ నుంచి విశ్వమానవుడిగా పీవీ: పీవీ ప్రభాకర్రావు
విలేజ్ నుంచి విశ్వమానవుడిగా ఎదిగిన వ్యక్తి పీవీ నరసింహరావు అని పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్రావు అన్నారు. యూరప్లోని లాత్వియాలో ఆదివారం పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్రావు మాట్లాడుతూ పీవీ నేటి యువతకు ఆదర్శమని అన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని సంక్షోభంనుంచి గట్టెక్కించారని తెలిపారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ అని శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కన్వీనర్ మహేశ్ బిగాల అన్నారు. కార్యక్రమంలో నిథిం డైరెక్టర్ డాక్టర్ చిన్నం రెడ్డి, విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు.