వనపర్తి : ప్రతి చెరువు నిండాలి..ప్రతి ఎకరం పండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి ఈదుల చెరువును మంత్రి సందర్శించారు. ఈదుల చెరువు నుంచి శ్రీనివాసపూర్-లక్ష్మి కుంటకు మినీ ఎత్తిపోతల పథకం మోటర్ను ఆన్ చేసి నీటి తరలింపును ప్రారంభించారు.
అలాగే మొండి కుంటకు లక్ష్మి కుంటగా నామకరణం చేసి వేరుశెనగ పంటలను పరిశీలించారు. అంతకుముందు కులాంతర వివాహం చేసుకున్న 10 మందికి ప్రభుత్వ ప్రోత్సాహక చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమైక్య రాష్ట్రంలో చెరువులు, కుంటలను ఎండబెట్టారన్నారు.
వాటి నిర్వహణను గాలికి వదిలేసి, రైతులను వారి కర్మానికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలను పునరుద్ధరించారని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట నీటితో కళకళలాడుతున్నాయి.
రైతు సంతోషంగా ఉంటే పల్లె సంతోషంగా ఉంటుందని మంత్రి తెలిపారు. రైతు చుట్టూ అల్లుకున్న జీవితాలు సంతోషంగా ఉంటాయి. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటితో పాటు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. నేడు సాఫ్ట్ వేర్ యువత కూడా నేడు ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేస్తున్నారని మంత్రి తెలిపారు.