హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది. నర్సింగ్ విద్యకు ఈ ఏడాది బడ్జెట్ 26.24 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. గత ఏడాది నర్సింగ్ విద్యకు 2.52 కోట్లు కేటాయించారు. ఈ సారి నర్సింగ్ కళాశాలలు పెరుగుతున్నందున బడ్జెట్లో కేటాయింపులను పదింతలు పెంచారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, మరో తొమ్మిది కాలేజీల పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం 26 కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు రానున్నాయి. ప్రస్తుతం తొమ్మిది ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో రెండు హైదరాబాద్లో, మిగతా ఏడు కామారెడ్డి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా జిల్లాల్లో నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.
26 నర్సింగ్ కళాశాలలు