Telangana Police | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): మీకు పిల్లల అశ్లీల (చైల్డ్పోర్న్) వీడియోలు, ఫొటోలు, ఇతర అభ్యంతరకర కంటెంట్ చూసే అలవాటుందా? మిమ్మల్ని ఎవరూ చూడటం లేదులే అని దొంగచాటుగా చైల్డ్పోర్న్ వీడియోలు చూస్తున్నారా? పదే పదే చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ను సెర్చ్ చేస్తున్నారా? అయితే మీరు జైలుకెళ్లడం ఖాయం. ఇకనైనా ఆ వక్రబుద్ధిని మార్చుకోకపోతే, చట్టం ముందు దోషిగా నిలబడటం తప్పదని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వివిధ ఆన్లైన్ వేదికల ద్వారా చైల్డ్పోర్నోగ్రఫీని దొంగతనంగా చూస్తున్న వారిని దొరకబట్టి జైళ్లకు పంపుతున్నారు. బాలల లైంగిక వేధింపు అంశాలను, వీడియోలను, ఫొటోలను సర్క్యూలేట్ చేసేవారిపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) టిప్లైన్స్ ఆధారంగా నిఘా పెట్టారు. టిప్లైన్స్ ఆధారంగా నెల వ్యవధిలోనే 43 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం మరో 34 కేసులు దర్యాప్తులో ఉండగా.. 8 కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పీడోఫైల్స్ మనస్తత్వం ఉన్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. ‘పీడోఫైల్స్’ మనస్తత్వం అంటే.. పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ ఉండటం. ఈ స్వభావం ఉన్న వారు సోషల్ మీడియా, యాప్లు, వీడియో గేమ్స్ ద్వారా పిల్లలతో స్నేహం చేయడం, వారితో నాటకీయంగా భావోద్వేగాలు ఏర్పచుకోవడం.. తినుబండారాలు ఆశచూపి తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఆన్లైన్ వేదికగా ఇలా తమ దారిలోకి తెచ్చుకోవటాన్ని ‘ఆన్లైన్ గ్రూమింగ్’ అంటారు.
ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో కరోనా మహమ్మారికి ముందు 2018లో ప్రతిరోజూ 110 మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యేవారు. లాక్డౌన్ సమయంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీశామ్)కు ఆన్లైన్లో విపరీతంగా డిమాండ్ పెరిగినట్టు గుర్తించారు. లాక్డౌన్లో సీశామ్ 200 నుంచి 250 శాతం పెరిగినట్టు భారత సైబర్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. ఇప్పుడు ఇండియాలో విపరీతంగా సీశామ్ కంటెంట్ వైరల్ అవుతున్న మాధ్యమాల్లో టెలిగ్రామ్ ఒకటి. దురదృష్టకర విషయం ఏంటంటే.. దేశవ్యాప్తంగా సీశామ్ కేసుల్లో అరెస్టయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఉండటమే. వీరితోపాటు విద్యార్థులు సైతం చైల్డ్పోర్నోగ్రఫీకి అలవాటు పడుతున్నట్టు గుర్తించారు.
మనదేశంలో సీశామ్ ఫైల్స్ చట్టవిరుద్ధం. సెక్షన్ 67(బి), ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షార్హులు. మిమ్మల్ని ఎవరూ చూడటం లేదని రెచ్చిపోతే.. ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. ఇలాంటి కేసుల్లో అన్ని ఫోన్ల ఐపీ అడ్రస్లు జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోలీసులకు తెలిసిపోతాయి. ఈ కేసుల్లో నేరం నిరూపితమైతే ఏడేండ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నది.
– మహేశ్ ఎం భగవత్, అడిషనల్ డీజీ, సీఐడీ