పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండడం వల్ల వనపర్తి అనే పేరు వచ్చింది. స్వాతంత్య్రం రాకముందు ఇది ఒక సంస్థానం. విలీనం తర్వాత ఎన్నికల్లో ఇక్కడి సంస్థానాధీశుల ప్రభావం ఎక్కువగా ఉండేది. వీరిని నిలువరించేందుకు అనేక ఉద్యమాలు జరిగాయి. గోల్కొండ పత్రిక సంపాదకులు, సాహితీవేత్త సురవరం ప్రతాప్రెడ్డి వనపర్తి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో వలసల వనపర్తి నేడు సస్యశ్యామలమైనది.
వనపర్తి నియోజకవర్గం 1952లో ఏర్పాటయ్యింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా 11 సార్లు కాంగ్రెస్, టీడీపీ 4 సార్లు గెలిచాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండోసారి వచ్చిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అధిక మెజారిటీతో వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగురవేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలకు నాంది పలికారు.
రాష్ట్రమంతటా టీఆర్ఎస్ విజయ ప్రభంజనం మోగించింది. కానీ ఉమ్మడి మహబూబ్నగర్లో టీఆర్ఎస్ జెండాను భుజాన వేసుకున్న నిరంజన్రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ నిరంజన్రెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు.
మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు
వనపర్తిలో మెడికల్ కళాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయించారు. వీటితోపాటు అగ్రికల్చరల్ బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్, మత్స్య కళాశాలలను నెలకొల్పారు. 100 పడకల జిల్లా దవాఖానను 300లకు పెంచారు. 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం, రూ.16 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్, 10 డయాలసిస్ బెడ్లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. 43 ఎకరాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఒక్క జడ్పీటీసీ మినహా అన్ని మండల పరిషత్ లు, జడ్పీ, జడ్పీ చైర్మన్ స్థానాలన్నీ బీఆర్ఎస్వే. నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పా టు చేస్తూ కార్యకర్తలు, నాయకులకు మరింత చేరువగా ఉంటూ మంత్రి సింగిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోసారి వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వమంతా సంసిద్ధులై ఉన్నారు.
వ్యవసాయానికి జీవం..
మంత్రి నిరంజన్రెడ్డి ప్రధానంగా సాగునీటి వనరులపై దృష్టి సారించారు. కాల్వలు, చెరువుల్లో పూడిక తీయించి నీటితో నింపుతున్నారు. 64 ప్రాంతాల్లో మినీ లిఫ్ట్టులను నిర్మించి మెట్ట భూములకు నీరందిస్తున్నారు. ప్రభుత్వం వనపర్తిని జిల్లా కేంద్రంగా చేసి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సముదాయాలను నిర్మించింది. విద్యుత్ లో వోల్టేజీ సమస్యలను పరిష్కరించడానికి సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి దశలో 389 మంది గిరిజనులకు 455 ఎకరాల పోడు భూమి పట్టాలను అందజేశారు. రైతువేదికలు, పార్కులు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయించారు.