హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): భాగ్యనగర వాసులకు విద్యాసుంగంధాన్ని పంచుతున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) సొసైటీ త్వరలో మరో క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నది. ఈ అంశంపై ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించిన హెచ్పీఎస్ సొసైటీ సభ్యులు.. కొత్త క్యాంపస్ను రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు స్థలాన్ని సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. శ్రీశైలం రహదారిలో స్థలం అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. నాణ్యమైన విద్యను అందించడంలో హెచ్పీఎస్ ఎంతో ఖ్యాతి పొందటంతో ఇతర ప్రాంతాల్లో కూడా క్యాంపస్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. తొలుత హైదరాబాద్లోని బేగంపేట, రామంతాపూర్లో క్యాంపస్లను ఏర్పాటు చేసిన హెచ్పీఎస్.. కొంత కాలం క్రితం వరంగల్లో ఓ క్యాంపస్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
ఆరుగురితో ప్రారంభమై..
1923లో కేవలం ఆరుగురు విద్యార్థులతో ప్రారంభమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం 2800 మంది విద్యార్థులతో వర్ధిల్లుతున్నది. ప్రీ ప్రైమరీ.. ప్రైమరీ, మిడిల్స్కూల్, హైస్కూల్స్ను నిర్వహిస్తున్నది. కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, సాఫ్ట్వేర్ దిగ్గజాలు సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, టీకే కురియన్, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మాజీ ఎంపీలు పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, జీ వివేక్, బాలీవుడ్ నడుడు వివేక్ ఒబెరాయ్, క్రికెట్ వ్యాఖ్యాత హర్షాభోగ్లే, సినీనటులు అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, సుమంత్, వర్తమాన నటి పూనమ్కౌర్, మోడల్, డిజైనర్ శిల్పారెడ్డి సహా అనేక మంది ప్రముఖులు హెచ్పీఎస్లో విద్యను అభ్యసించారు.