హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) లాంటి నిరంకుశ చట్టాల కింద జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయసాయం కోసం ‘న్యాయవాదుల రక్షణ కమిటీ’ని వివిధ న్యాయవాద సంఘాలు, న్యాయవాదులతో కలిసి ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ న్యాయవాదుల నిరసన దినం సందర్భంగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (ఐఏపీఎల్) ఆధ్వర్యంలో ‘ప్రమాదంలో ప్రజా న్యాయవాదులు’ అంశంపై సమావేశం నిర్వహించారు. దీనికి ఐఏఎల్, ఏఐఎల్యూ, ఐఎల్పీఏ, ఐఏపీఎల్ న్యాయవాదులు, వివిధ పౌరహక్కుల, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడే ప్రజాసంఘాల కార్యకర్తలపై ‘ఉపా లాంటి నిరంకుశ చట్టాల కింద కేసులు పెట్టి జైలులో దీర్ఘకాలం నిర్భదిస్తున్నారని పలువులు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 28 మంది, ఆంధ్రప్రదేశ్లో 12 మంది న్యాయవాదులపైనా ‘ఉపా’ కింద కేసులుపెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఆ కేసులు తక్షణమే ఉపసంహరించాలని, వారిపై బెదిరింపులు, వేధింపులు ఆపాలని వక్తలు కోరారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణ కమిటీని ఏర్పాటుచేశారు. సమావేశంలో ఐఏపీఎల్ ఉపాధ్యక్షుడు ఎం వెంకన్న, జాయింట్ సెక్రటరీ డీ సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.