హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖాన మరో అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘జీరియాట్రిక్ డిపార్ట్మెంట్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దక్షిణ భారతదేశంలో ఈ విభాగాన్ని కలిగే మూడో దవాఖానగా రికార్డు సాధిస్తుంది. ప్రస్తుతం చెన్నైలోని ఎంఎంసీ, వెల్లూరులోని సీఎంసీలో మాత్రమే ప్రత్యేక జీరియాట్రిక్ విభాగాలు ఉన్నాయి. దీంతోపాటు నిమ్స్లో ఎండీ జీరియాట్రిక్ కోర్సు, పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి నిమ్స్లో 2018 నుంచే జీరియాట్రిక్ వార్డు సేవలు అందిస్తున్నది. 65 ఏండ్లు పైబడినవారికి ఇక్కడ ఐపీ సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం దీనిని పూర్తిస్థాయి విభాగంగా మార్చటంతోపాటు రీజినల్ జీరియాట్రిక్ సెంటర్గా మార్చనున్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడైనా వృద్ధుల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేస్తే నిమ్స్ నోడల్ సెంటర్గా సేవలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్నది. దీనికి అనుగుణంగా అనారోగ్య సమస్యలతో దవాఖానకు వచ్చేవారు ఎక్కువవుతున్నారు. వారికి సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు వీలుగా జీరియాట్రిక్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేకంగా పీడియాట్రిక్ విభాగం ఉన్నట్టు, జీరియాట్రిక్ విభాగం పూర్తిగా వృద్ధులకే సేవలు అందిస్తుంది.
నిమ్స్ జీరియాట్రిక్ విభాగం విశేషాలు