హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ (పీఆర్సీ)ని నియమించాలని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ కోరింది. శనివారం విద్యుత్సౌధలో టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావును కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా వేతన సవరణ కమిటీ నియామకం సహా 1-2-99 నుంచి 31-8-2004 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్తు ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ (పాత పెన్షన్ పునరుద్ధరణ), మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందించినట్టు జేఏసీ చైర్మన్ జీ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు తెలిపారు. సీఎం కేసీఆర్, విద్యుచ్ఛక్తి శాఖమంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో సాధ్యమైనంత త్వరగా వేతన సవరణ కమిటీని నియమిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. యాజమాన్యం తరపున టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జెన్కో డైరెక్టర్ అశోక్కుమార్, జేఏసీ నేతలు ఈ శ్రీధర్, పీ బీసీరెడ్డి, వజీర్, కుమారస్వామి, రమాకాంత్, అశోక్కుమార్, సదానందం, తులసీనాగరాణి తదితరులు సీఎండీని కలిసిన వారిలో ఉన్నారు.