హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): నేషనల్ మెడికల్ కమిషన్ తాజా నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు రూ.కోటి జరిమానా విధిస్తామని ఎన్ఎంసీ ఇటీవల ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’లో పేర్కొన్నది. సదుపాయాల్లో లోపాలు ఉన్నా, బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి ఏవైనా అవకతవకలకు పాల్పడినా, ఇతర నిబంధనలను పాటించకున్నా కాలేజీకి రూ.కోటి వరకు జరిమానా విధిస్తామని ఎన్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఆయా విభాగాల అధిపతులు, డాక్టర్లకు రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నది. అంతేకాదు.. మెడికల్ కాలేజీ నుంచి ఏదేని దరఖాస్తు విషయంలో ఎన్ఎంసీ లేదా బోర్డుపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తే ‘ఆన్యువల్ డిస్క్లోజర్ రిపోర్ట్’ (ఏడీఆర్), ఇతర పత్రాలను తెప్పించుకొని పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు అంతిమంగా విద్యార్థులపైనే భారం మోపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్, ఎన్నారై కోటాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే ఏటా సుమారు 60 లక్షల వరకు ఖర్చవుతున్నదని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీపై జరిమానా విధిస్తే.. ముందుగా వారు తమ జేబులోనుంచే కడుతారని చెప్తున్నారు. తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవడానికి ఫీజులు పెంచుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కొత్తకొత్త పేర్లతో ఫీజులు వసూలు చేసే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.