Errabelli dayaker Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు..పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చిచెప్పారు.
వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల్లోకి వెళ్లే ముచ్చటనే లేదని స్పష్టంగా చెబుతున్నాను. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేస్తాను. ప్రతిపక్షంలో కూడా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది సీఎంలను కూడా ఎదుర్కొన్నాను. పార్టీలోకి రాకపోతే వర్ధన్నపేటను ఎస్సీ రిజర్వ్డ్ చేస్తాను.. ఎక్కడ పోటీ చేయనివ్వకుండా చేస్తానని రాజశేఖర్ రెడ్డి బెదిరించారు. ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ తనను పాలకుర్తి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు. పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాను అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.