జనగామ, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/దేవరుప్పుల/పాలకుర్తి : రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణలో నేడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజల మనసులను చూరగొన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంతోపాటు దేవరుప్పుల, పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో గులాబీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వల చరిత్ర ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దారని కొనియాడారు.
తెలంగాణ అవసరాలు, వనరులపై పట్టున్న కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో నిలిచినట్టు తెలిపారు. ముఖ్యంగా సాగు, తాగునీరు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విధానాన్ని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేసిన చరిత్ర ఉన్నదని అన్నారు. మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టిందని చెప్పారు. పదేండ్లు తెలంగాణను అభివృద్ధిలో ముందువరుసలో నిలిపారని కొనియాడారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తిరిగి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు.