పాలకుర్తి రూరల్, మార్చి 29: ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏప్రిల్ 3న నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ కేంద్రాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉచిత కోచింగ్ సెంటర్కు సంబంధించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం 81 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు. నియోజక వర్గంలోని నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా కోచింగ్ ఉంటుందని తెలిపారు. గతంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తిలో కోచింగ్ ఇవ్వగా సుమారు 300 మంది వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపికైనట్టు చెప్పారు. తాజా శిక్షణతో సుమారు వెయ్యి మంది ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.