PRLIS | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై మళ్లీ పీటముడి పడింది. ఈ అనుమతులను మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) గతంలోనే సిఫారసు చేసినప్పటికీ తాజాగా కేంద్రం మరో మెలిక పెట్టింది. ఈ ప్రాజెక్టుపై గతంలో ఎన్జీటీ విధించిన జరిమానా నిధుల వినియోగానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అది తర్వాతే పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
పాలమూరు ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాజెక్టుపై సందేహాలను లేవనెత్తుతూ ఈఏసీ సభ్యులు ఒక దశలో పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరించి, ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈఏసీ కోరిన సమాచారాన్నంతా సమర్పించింది. ఆ తర్వాత ఈఏసీ 49వ సమావేశంలో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించడంతోపాటు పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను గట్టిగా నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, తద్వారా కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఈఏసీ కోరిన నివేదికలన్నీ అందజేసింది. వాటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ.. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయవచ్చని నిరుడు ఆగస్టు 10న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది. నాటి నుంచి ఆ దస్త్రం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను చేపడుతున్నదని, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ ఏపీలోని కడప జిల్లాకు చెందిన పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఆ బృందం పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పలు రిజర్వాయర్లను సందర్శించి, పర్యావరణ ఉల్లంఘనల వల్ల మొత్తంగా రూ.3.7 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. దీనిలో వాస్తవమెంతో తేల్చేందుకు ఎన్జీటీ మరో ఏకసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటి వరకూ తన నివేదికను సమర్పించలేదు. అయినప్పటీకీ ఎన్జీటీ ఆగమేఘాల మీద దిండి, పాలమూరు ప్రాజెక్టులకు కలిపి రూ.920 కోట్ల జరిమానా విధించింది. అందులో పాలమూరు ప్రాజెక్టుపైనే రూ.600 కోట్లకుపైగా జరిమానా విధించింది.
ఇప్పుడు ఈ జరిమానానే సాకుగా చూపుతూ పర్యావరణ అనుమతుల మంజూరుకు మోకాలడ్డుతున్న కేంద్ర పర్యావరణశాఖ.. జరిమానా నిధుల వినియోగానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రాజెక్టు వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది? జరిమానా నిధులను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేయాలనే దానిపై నివేదించాలని ఆ కమిటీకి మార్గదర్శకాలను జారీ చేసినట్టు సమాచారం. ఆ నివేదిక అందిన తర్వాతే పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. కాగా, పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులెవరు? వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? అన్న విషయాలపై నిలదీస్తూ కాలుష్య నియంత్రణ మండలికి కేంద్రం లేఖ రాసింది. దీంతో పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరు మరింత జాప్యమయ్యేలా ఉన్నది.