హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చనాక-కొరాట ప్రాజెక్టుకు అన్ని విభాగాల నుంచి అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి ప్రాజెక్టుకు శుక్రవారం పర్యావరణ అనుమతులు మంజూరు కావడంతో పర్మిషన్ల ఘట్టం ముగిసింది. దీంతో రెండేండ్లుగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఇంజినీరింగ్ అధికారులు చేసిన అవిశ్రాంత కృషి ఫలించింది. జూలై 2021లో కేంద్రం జారీచేసిన రివర్ బోర్డుల గెజిట్ను అనుసరించి అనుమతులు లేని ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు పొందాల్సి ఉన్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చనాక-కొరాట ప్రాజెక్టు డీపీఆర్లను అదే ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జలసంఘంలో భాగమైన వివిధ డైరెక్టరేట్లు ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత గెజిట్ను అనుసరించి డీపీఆర్లను పరిశీలించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు పంపగా, 13వ బోర్డు మీటింగ్లో దానిపై చర్చించి తిరిగి సీడబ్ల్యూసీకి పంపింది. దీంతో గత నవంబర్ 29న కీలకమైన టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ను సైతం సాధించింది. తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది.
స్వరాష్ట్రంలో దశాబ్దల కలకు మోక్షం
చనాక-కొరాట ప్రాజెక్టు అనుమతుల సాధన కోసం ప్రభుత్వం ఆది నుంచీ పక్కా ప్రణాళికలతో ముందుకుసాగింది. వాస్తవంగా గోదావరి సబ్బేసిన్ జీ-7లో పెన్గంగపై మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఘటాంజీ తాలుకా తడనవాలి వద్ద 42.67 టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్గంగ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. దానినుంచి వచ్చే కుడి కాలువ ద్వారా మహారాష్ట్ర నీరు వాడుకోవాలి. 89 కిలోమీటర్ల పొడవు ఉండే ఎడమ కాలువ ద్వారా తెలంగాణలో 47,520 ఎకరాలకు సాగునీరు అందించాలి. దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టును మహారాష్ట్ర ముందుకు తీసుకుపోవడం లేదు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పేరిట ఉమ్మడి పాలకులు ఓట్లు దండుకున్నారు తప్ప చేసిందేమీ లేదు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పెన్గంగపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెన్గంగపై గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో సమగ్రమైన ఒప్పందం చేసుకున్నారు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాక-కొరాట బరాజ్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. చనాక-కొరాట బరాజ్ నిర్మాణానికి 368 కోట్లు, లోయర్పెన్గంగ పనులకు 1,227 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూ రు చేశారు. ఉమ్మడి పాలకులు నాలుగు దశాబ్దాలుగా పూర్తిచేయలేని కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు.
అనుమతుల సాధనకూ అవిశ్రాంత కృషి
చనాక-కొరాట అనుమతుల సాధనకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉమ్మడిగానే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్రం షరతులు విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులకు సంబంధించి అన్ని ప్రక్రియలను పూర్తిచేయడంతోపాటు బరాజ్ నిర్మాణం సైతం పూర్తిచేసింది. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం తన పోర్షన్కు సంబంధించిన పనులకు ఇప్పటికీ పరిపాలన అనుమతులను కూడా మంజూ రు చేయలేదు. దీనికితోడు 0.5 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించిన అనుమతులను కూడా తీసుకోలేదు. ఇది పర్యావరణ అనుమతులు పొందడానికి అడ్డంకిగా మారింది. దీంతో సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు ఈఎన్సీ హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఇతర ఇంజినీరింగ్ అధికారులు రెండేండ్లుగా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ వచ్చారు. తెలంగాణ వాదనలతో ఏకీభవించిన కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఎట్టకేలకు గత నవంబర్లో టీఏసీకి అనుమతులు ఇవ్వగా, తాజాగా పర్యావరణ అనుమతులు మంజూరుచేసింది.