IIT Bombay | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లు అంతా కంప్యూటర్సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సు బాట పట్టారు. ఈ కోర్సులో చేరేందుకే అత్యధికులు ఆసక్తి చూపించారు. వెయ్యిలోపు ర్యాంకర్లంతా సీఎస్ఈ సీట్లు పొందిన ఐఐటీల్లో.. హైదరాబాద్ ఐఐటీ కూడా ఉన్నది. శుక్రవారం జోసా మొదటి విడత సీట్లు కేటాయించారు. అత్యుత్తమ ర్యాంకర్లు బాంబే ఐఐటీలో సీఎస్ఈ కోర్సులో సీట్లు దక్కించుకొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ఆలిండియా టాపర్, మన రాష్ట్ర విద్యార్థి వావిలా చిద్విలాస్రెడ్డి, రెండో ర్యాంకర్ రమేశ్ సూర్యతేజ, ఏడో ర్యాంకర్ బిక్కిన అభినవ్ అంతా ఐఐటీ బాంబేలోని సీఎస్ఈ కోర్సు లో చేరారు. సీటు పొందిన జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు రూ. 40వేలు, ఎస్సీ, ఎస్టీ వికలాంగ విద్యార్థులు రూ.20వేలు ఫీజుగా చెల్లించాలి. నిరుటి కంటే అన్నిక్యాటగిరీల్లో రూ.5 వేలు పెంచారు.
ఈ మూడు కీలకం
జోసా కౌన్సెలింగ్లో భాగంగా ఈ మూడు కీలకం. మొదటివిడతలో వచ్చిన సీటు పట్ల సంతృప్తిచెందితే ఫ్రీజ్ చేసుకోవచ్చు. సంతృప్తిచెందని పక్షంలో తదుపరి విడతలోలో మంచి సీట్ల కోసం ఫ్లోటింగ్కు వెళ్లవచ్చు. తాజాగా సీటు వచ్చిన సంస్థలోనే మరో బ్రాంచిలో సీటు దక్కించుకోవడానికి ైస్లెడ్ అప్షన్ను ఎంచుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థులు తమ అవసరాలను బట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒకటి నొక్కబోయి మరొటి నొక్కినా.. తప్పుగా ఎంచుకున్నా సమస్యలు తప్పవు.
ఎంసెట్లో ఖాళీ సీట్లకు చెక్
ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్ ముందుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల మిగులు సమస్యకు తెరపడే అవకాశాలున్నాయి. జోసా సీట్లను శుక్రవారం కేటాయించగా, ఎంసెట్ సీట్లను ఈ నెల 12న కేటాయిస్తారు. జేఈఈ కౌన్సెలింగ్కు హాజరైన వారు ఎంసెట్కు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువుంటాయి. దీంతో మిగులు సీట్ల సమస్య ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.