హైదరాబాద్: దీపావళి పండుగ అనే పదం వినగానే మన కళ్లలో మెదిలే దృశ్యం పటాకులు, దీపాలే. పటాకులు కాల్చేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పండుగ పూట కాలిన గాయాలతో ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా కళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు అస్సలు పనికిరాదు. కళ్ల విషయంలో చిన్న పొరపాటు చేసినా జీవితం అంధకారం అవుతుంది. అందుకే పటాకులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి నేత్ర నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
దీపావళి వేడుకల వేళ పటాకులు కాల్చే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నేత్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. దీపావళి పటాకులను తగినన్ని జాగ్రత్తలు తీసుకుని కాల్చాలని, పటాకులు కాల్చే సమయంలో పిల్లలను కుటుంబంలోని పెద్దలు పర్యవేక్షించాలని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన సీనియర్ నేత్ర వైద్యుడు అనుభా రాఠి సూచించారు.
ఎంత జాగ్రత్తగా ఉన్నా కళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లక ముందు చేయాల్సిన ప్రాథమిక చికిత్స గురించి మాక్స్ విజన్ ఐ హాస్పిటల్కు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి వివరించారు. కళ్లకు తీవ్ర గాయాలైన సందర్భాల్లో తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. స్వల్ప గాయాలైన సందర్భాల్లో శుభ్రమైన తాగునీటితో కళ్లను కడగాలన్నారు. అదేవిధంగా ఒక కప్పు శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కనురెప్పలు ఆడించాలని చెప్పారు. అనంతరం నేత్ర వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స, మందులు తీసుకోవాలని సూచించారు.