TS EAMCET | హైదరాబాద్ : తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 16వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని పొడిగించారు. ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు టీఎస్ ఎంసెటర్ కన్వీనర్ అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ఫస్ట్ ఫేజ్లో 85.48 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందిన విషయం విదితమే. మూడు యూనివర్సిటీలు, 28 ప్రయివేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయని అధికారులు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో 85.12 శాతం, ప్రయివేటు యూనివర్సిటీల్లో 75.08 శాతం, ప్రయివేటు కాలేజీల్లో 85.71 శాతం సీట్లు నిండాయి. మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా, ఫస్ట్ ఫేజ్లో 70,665 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.